ఖరీదైన శస్త్రచికిత్స కావడంతో చేతులెత్తేసిన తల్లిదండ్రులు
క్రౌడ్ ఫండింగ్లో విరాళాలు సేకరించి.. విజయవంతంగా చికిత్స చేసిన కేర్ వైద్యులు
బంజారాహిల్స్, మే 10: కాలేయ వ్యాధితో బాధపడుతున్న మూడేండ్ల చిన్నారికి దాతల సహకారంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. సోమవారం కేర్ దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ నయీం వివరాలను వెల్లడించారు. కోల్కతాకు చెందిన మూడేండ్ల రాకీకి ప్రాణాంతకమైన కరోలీ సిండ్రోమ్ అనే కాలేయ వ్యాధి సోకింది. దీంతో తరుచు జ్వరం రావడంతో పాటు పౌష్టికాహార లోపం, కామెర్లు, నల్లటి విరోచనాలు అయ్యేవి. కడుపులో రక్తస్రావం అవుతుండటంతో అనేక ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చేరారు.
కాలేయ మార్పిడి ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని వైద్యులు గుర్తించారు. అయితే, అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్స కావడంతో సర్జరీ చేయించాలంటే తమ వద్ద డబ్బులేదని బాలుడి తల్లిదండ్రులు చేతులెత్తేశారు. అయితే, కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా చిన్నారికి చేయాల్సిన కాలేయ మార్పిడికి విరాళాలు సేకరించి ఇటీవల విజయవంతంగా అరుదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. సర్జరీ విజయవంతం కావడంతో పాటు బాలుడు పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ నయీం తెలిపారు. సమావేశంలో కన్సల్టెంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ వచన్ తదితరులు పాల్గొన్నారు.