అమీర్పేట్, జనవరి 3: సనత్నగర్ ఎర్రగడ్డ రహదారి విస్తరణతో ట్రాఫిక్ సమస్య తగ్గుముఖం పడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రధాన రహదారిపై రోడ్డు విస్తరణ కోసం కేటాయించిన సబ్స్టేషన్ స్థలాన్ని మంగళవారం కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి ఆయన పర్యిశీలించారు. ఎర్రగడ్డ నుంచి సనత్నగర్ బస్టాండ్ వరకు తలపెట్టిన రోడ్డు విస్తరణ పనులకు సనత్నగర్లోని సబ్స్టేషన్ ప్రదేశం ఇరుకుగా ఉండేది. అయితే రోడ్డు విస్తరణకు ఇక్కడి సబ్స్టేషన్ స్థలాన్ని సేకరించక తప్పని పరిస్థి తి నెలకొంది. దీంతో మంత్రి తలసాని ట్రాన్స్కో సీఎండి రఘుమారెడ్డితో ఫోన్లో మాట్లాడి, స్థలం కేటాయింపులు జరిగేలా చూశారు. రెండు రోజుల క్రితం కేటాయించిన స్థలాన్ని వదిలి సబ్స్టేషన్కు ప్రహరీని నిర్మించుకోవడంతో ఈ ప్రదేశంలో విస్తరణ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతోందని, ఇక్కడి ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించి, చక్కటి రోడ్డు డివైడర్ నిర్మాణాలు చేపట్టి ఈ రోడ్డును అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్ఈ కామేశ్, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీఈ మోహన్రెడ్డి, ఈఈ ఇందిర, బయో డైవర్సిటీ విభాగం డీడీ శ్రీనివాస్, టౌన్ప్లానింగ్ ఏసీపీ రమేశ్, జెక్కాలనీ రెసిడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షలు, మాజీ అధ్యక్షుడు జి.సూర్యశంకర్రెడ్డి, డాక్టర్ రాఘవయ్య, బీఆర్ఎస్ నాయకులు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బస్సులను పునరుద్ధరించండి
గతంలో సనత్నగర్ నుంచి నగర నలుమూలలకు కొనసాగిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సనత్నగర్కు బస్సుల సంఖ్య తగ్గిపోయిందన్న స్థానికుల ఫిర్యాదుల మేరకు ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న, డీవీఎం ఏఆర్ఎస్ రెడ్డిలతో కలిసి సనత్నగర్ బస్ టర్మినల్ను సందర్శించిన మంత్రిని కలిసిన స్థానికులు ఇక్కడ సౌకర్యాలను మెరుగుపర్చాలని, అలాగే బస్సులు అనుకూలంగా ముం దుకు సాగేందుకు వీలు లేకుండా ఎక్కడికక్కడ ఆక్రమణలు చోటు చేసుకున్నాయని తన దృష్టికి తేవడంతో వెంటనే ఆక్రమణలను తొలగించాలంటూ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సనత్నగర్ నుంచి గతం లో కొనసాగిన 158, 92, 9ఎం, 45, 83, 183, 283లను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.