ఎల్బీనగర్, ఏప్రిల్ 28: ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చిన కొత్త ప్రజాప్రతినిధులు అప్పుడే వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. నిర్మితమవుతున్న భవనాలనే లక్ష్యంగా చేసుకున్నారు. వీలైనన్ని సొమ్ములు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలోని నూతన ప్రజాప్రతినిధులంతా కొత్త నిర్మాణాలు, అక్రమ కట్టడాలపైనే దృష్టి సారిస్తున్నారు. ఒకరిద్దరూ కాస్తా అభివృద్ది పనులంటూ ప్రయత్నాలు చేస్తున్నా.. మిగిలిన వారందరూ కొత్త భవనాలు ఎక్కడ వెలుస్తున్నాయో ఆరా తీస్తున్నవారే. ప్రజలకు సేవ చేస్తామంటూ.. అభివృద్ధికి అవకాశం ఇవ్వాలంటూ.. ఎన్నికల బరిలో దిగిన నాయకులు తీరా ఎన్నికల్లో గెలిచాక తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కొన్ని డివిజన్లలో ప్రజాప్రతినిధులుగా ఉంటున్న డివిజన్ స్థాయి నాయకులు తమ డివిజన్లలో ఎన్నికల్లో అయిన ఖర్చులను రాబట్టుకునే పనిలోనే నిమగ్నమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు మేం అంతా సచ్చీలురమే అంటూ ప్రకటిస్తునే మరోవైపు తమకు ఆదాయం వచ్చే అంశాలు డివిజన్లలో ఏమున్నాయంటూ ఆయా విభాగాల అధికారులను వాకబు చేస్తున్నారు. ప్రధానంగా అందరి దృష్టి టౌన్ప్లానింగ్ విభాగం వారిపైనే ఉన్నాయి. టౌన్ప్లానింగ్ అధికారులు సైతం ప్రజాప్రతినిధుల కంటే ముందే సదరు భవనాల వద్ద అందినకాడికి దండుకుని ఉండటంతో వారు కూడా వీరికి సహకరించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రధానంగా తమ డివిజన్లలో నిర్మాణంలో ఉన్న భవనాలు ఎన్ని.. అని ఆరా తీయడంతో పాటుగా ఈ సంఖ్యను అడిగిన వెంటనే టక్కున చెప్పేస్థాయిలో సదరు నాయకులు ఉన్నారు.
అంటే వీరు ఈ విషయంలో ఎంత అద్బుతంగా లెక్కిస్తున్నారో.. ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అదేరీతిలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే పట్టించుకోని టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది ఈ వివరాలను సదరు నాయకులకు చెప్పేందుకు మాత్రం ముందు వరుసలో ఉంటున్నారు. దీంతో ఆయా డివిజన్ల నాయకులు తమ డివిజన్లోని అక్రమ నిర్మాణాల నుంచి తమకు అందినకాడికి దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వసూళ్లకు శ్రీకారం చుట్టేందుకు కొన్ని డివిజన్లలో నాయకులు తమ అనుచరులతో రెండు, మూడు టీంలను తయారు చేసుకుని వారితో వ్యవహరం నడుపుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఇలా వసూళ్లకు పాల్పడుతున్న నాయకులు తమ వద్దకు సమస్యపై వచ్చిన ప్రజల ముందు, అధికారుల ముందు మాత్రం తాము కోట్లు ఖర్చు పెట్టి వచ్చామని, తమ ఆఫీసు కార్యకలాపాలు కూడా కొనసాగించేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంటూ మభ్యపెడుతున్నారు.
కొత్తపేట డివిజన్లోని ఓ ప్రభుత్వ స్థలాన్ని ఏకంగా ప్రైవేటు పరం చేయడంలో రెవెన్యూ విభాగం వారు ఎంత ఉత్సాహ పడుతున్నారో, అదే రీతిలో అక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు, గదులు చేసినా టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు కూడా అమ్యామ్యాలు తీసుకుని అంతే ఉత్సాహన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక చైతన్యపురి మూసీ నాలాపై నిర్మాణాలు ఇష్టానుసారంగా సాగినా తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. సామాన్యులు చిన్న ఇల్లు కడితే చాలు.. నిబంధనలు చెబుతూ ఆంక్షలు పెడుతున్న అధికారులు బహుళ అంతస్తుల భవనాల్లో నిబంధనలు పాటించకున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాగోలు సాయినగర్ కాలనీలో అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాలు చేయడంతో పాటుగా పలు డివిజన్లలో ఓపెన్ స్పేస్ జోన్లో నిర్మాణాలు సాగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఇలాంటి వారే నాయకులకు ఆదాయమార్గాలుగా మారారని తెలుస్తోంది. అంతేకాక డివిజన్ల పరిధిలోని వివాదాస్పద స్థలాలు ఉంటే చాలు.. ఇక వాటిపైనే సదరు నాయకులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించే నెపంతో వారి నుంచి ముడుపులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం డివిజన్ల వారీగా ఏ ప్రాంతంలో చూసినా నాయకుల వసూళ్ల దందాలపై చర్చలు జరుగుతున్నాయి. ఓ డివిజన్లో ఓ కార్పొరేటర్ భర్త తానే అన్ని అనే రీతిలో చక్కర్లు కొడుతుండగా, అదే డివిజన్లో కార్పొరేటర్ మరిది ఇంజినీరింగ్ విభాగం అధికారులను బెదిరించి దాఖలాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని డివిజన్లలో కార్పొరేటర్ల బంధువులే ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఏ డివిజన్లో చూసినా వివాదాలే కన్పిస్తున్నాయి.