బోడుప్పల్, డిసెంబర్8 : మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీరవి గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘రా’ చెరువు కలుషిత జలాల దుర్వాసన నుంచి పరిసర ప్రాంతవాసులను కాపాండేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు సమస్యకు శ్వాశత పరిష్కారానికి భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని ద్వారకానగర్ కాలనీ నాలాపై బాక్స్ డ్రైన్కు రూ.2కోట్లు, సాయి భవానీనగర్ కాలనీ బాక్స్డ్రైన్ ఏర్పాటుకు రూ.2కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రా చెరువు నాలా పరిసర ప్రాంతాల్లో మేయర్ బుచ్చిరెడ్డి, కమిషనర్ పద్మజరాణి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి పర్యటించిన మంత్రి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. నాలా అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇబ్బందులను తొలగిస్తామన్నారు. అనంతరం 13వ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీలో రూ.22లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బోడుప్పల్ కార్పొరేషన్లో ప్రధాన రహదారులను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని మేయర్ సామల బుచ్చిరెడ్డి మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ పద్మజరాణి, డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు వెంకటేశ్, పద్మారెడ్డి, జంగయ్యయాదవ్, చందర్గౌడ్, బూక్యా సుమన్ నాయక్, చీరాల నర్సింహ, చందర్గౌడ్, నాయకులు కృష్ణ, విశ్వనాథ్, యాదగిరి పాల్గొన్నారు.