సైదాబాద్, జనవరి 14 : కరణ్బాగ్ కాలనీలోని శ్రీమల్లికార్జున స్వామి ( మల్లన్నస్వామి) ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి పూజలు చేశారు. స్వామి బోనాల ఊరేగింపు వైభవంగా కొనసాగింది. వేడుకల్లో భాగంగా ఉగాది వరకు నిత్యార్చన కార్యక్రమాలను నిర్వహిస్తారు. మల్లన్నస్వామి అగ్నిగుండాల ప్రవేశం, గొలుసు తెంపటం, ఒగ్గు పూజారులకు సత్కారం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో బోనాల ఉత్సవాలను తిలకించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి వీఎన్వీ సత్యనారాయణ, ఆలయ ప్రతినిధులు మడిగాల లక్ష్మారెడ్డి, కోశిక కృష్ణ , మధుసూదన్ పాల్గొన్నారు.
హరిహర క్షేత్రంలో.. గోదారంగనాథుల కల్యాణం
మలక్పేట పల్టన్ దయానంద్నగర్లోని హరిహర క్షేత్రం, మైసమ్మ ఆలయంలో శనివారం అర్చకులు మంగళగిరి శ్రీనివాసాచార్యులు, కాసుల చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో గోదారంగనాథుల కల్యాణం వైభవంగా జరిగింది. పవిత్ర ధనుర్మాసంలో చేసే పూజలకు భక్తిపరంగా విశిష్టత ఉందని వారు తెలిపారు. ధనుర్మాసంలో 30రోజుల పాటు నిర్వహించిన వ్రతం కల్యాణంతో ముగుస్తుందన్నారు. ముత్తైదువులకు కుంకుమ, అక్షింతలు అందచేసి అన్న సంతర్పణ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కల్యాణాన్ని తిలకించటానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలుగుకుండా ఆలయ టస్టీ చైర్మన్ సూగూర్ రమేశ్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు ముత్యాల అశోక్ కుమార్, రాజ్యలక్ష్మి, శ్రీహరి ఏర్పాట్లు చేశారు.
శ్రీవేంకటేశ్వరాలయంలో గోదా కల్యాణం..
పూసలబస్తీలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరాలయంలో శ్రీగోదారంగనాథుల కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో నెలరోజులపాటు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తరుఫున ఘన తిరుప్పావై ప్రవచనాలను శ్రీదరాచార్యులు ఉపదేశించారు. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నేత్రపర్వంగా గోదా, శ్రీనివాస కల్యాణం
ముగిసిన తిరుప్పావై ప్రవచనోత్సవాలు
మలక్పేట, జనవరి 14 : మూసారాంబాగ్లోని ఆండాళ్ నిలయంలో ధనుర్మాస తిరుప్పావై ప్రవచనోత్సవాల్లో భాగంగా శనివారం గోదా, శ్రీనివాస కల్యాణం, ఫలశృతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీమాన్ అప్పన్ కందాడై లక్ష్మణామూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన వంగక్కడల్ కడైంద, గోదాదేవి కల్యాణ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దంపతులు అమ్మవారి కల్యాణానికి ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య సంభావన, అతిథి సన్మానం, ప్రసాద నివేదన గావించారు. డిసెంబర్ 16న ప్రారంభమై జనవరి 14 వరకు కొనసాగిన తిరుప్పావై ప్రవచనోత్సవాల్లో మార్గళిత్తింగల్ ప్రవచనం, సౌభాగ్యవతులకు పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలాల వితరణ, వైకుంఠ ఏకాదశి వేడుకలు, దీపోత్సవం, ఆండాళ్ మాతకు నీరాటోత్సవం, అక్కార వడిషల్ ప్రసాద నివేదన తదతర పూజ కార్యక్రమాలు నిర్వహించటం జరిగిందని, గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస వ్రత సమాప్తితోపాటు తిరుప్పావై ప్రవచనోత్సవాలు ముగిశాయని ఆండాళ్ నిలయం నిర్వాహకురాలు ఎ.లక్ష్మీదేవి, రూపాదేవి, రామకృష్ణ తెలిపారు.
ఎస్బీఐ కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో..
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఎస్బీఐ కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా, శ్రీనివాస కల్యాణ వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ పూర్ణచందర్రావు, కార్యదర్శి హరిగోవింద్ ప్రసాద్, వైస్ చైర్మన్ కె.వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి విశ్వేశ్వర్రావు, కోశాధికారి రంగాచారి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.