ఖైరతాబాద్, జూలై 17: ప్రపంచంలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఖైరతాబాద్ గణనాథుడు ఈ ఏడాది శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం సాయంత్రం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ విగ్రహ నమూనాను సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, మహాశిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ చేతుల మీదుగా ఆవిష్కరించింది.గతేడాది కరోనాకు టీకా రావాలని స్వామివారిని కొలువగా, ఆ కోర్కె తీరిందని, ఈ సారి మహమ్మారి పూర్తిగా నశించాలని స్వామి వారిని కొలువాలని దైవజ్ఞ శర్మ కోరారు.
శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో అనేక ప్రత్యేకతలున్నాయి. సృష్టి, స్థితి, లయకారులుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిని కొలుస్తారు. ఇందులో శివుని రుద్రునిగా పూజిస్తారు. ప్రస్తుతం ప్రపంచానికి ప్రళయంలా దాపురించిన కరోనాను పారదోలాలంటే ప్రళయకారకుడైన మహారుద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఆయన ప్రథమ కుమారుడు గణపతినే రుద్రావతారునిగా కొలిస్తే…ఈ మహమ్మారిని అంతమొందింవచ్చన్న సంకల్పంతో రుద్ర మహాగణపతిగా స్వామి వారిని ప్రతిష్ఠిస్తున్నారు. పంచభూతాలను రక్షించే దేవుడిగా ఈ సారి స్వామి వారిని శ్రీ పంచముఖ మహాగణపతిగా రూపొందిస్తున్నారు.
శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో పంచముఖాలకు సంబంధించిన దేవతలకు వాహనాలు ఇక్కడ దర్శనమిస్తాయి. సూర్యుడు (గుర్రం), శ్రీ మహావిష్ణు (గరుత్మంతుడు),శివుడు(నందీశ్వరుడు),పార్వతిదేవి (సింహం), ప్రధానమైన గణపతి వాహనమైన మూషికాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.
ఖైరతాబాద్ గణేశుడిని ఈసారి 40 అడుగుల ఎత్తుతో ప్రతిష్ఠిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిసింది. శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో స్వామి వారి విగ్రహం రూపుదిద్దుకుంటున్న స్వామి వారి ఓ వైపు చక్రం, త్రిశూలం, పరశు, సర్పం, అభయం, మరో వైపు శంఖం, అంకుశం, పద్మం, గధ, చేతిలో లడ్డుతో దశ భుజా లు (పది చేతులు) తో ఆదిశేషుని నీడలో నిల్చు న్న రూపంలో దర్శనమిస్తారు.
గత రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని కరోనా అనే విపత్తు ప్రజలను కష్టాల్లోకి నెట్టివేసింది. ఈ ఉపద్రవాలు తొలగిపోవాలంటే విలయా న్ని రూపుమాపేందుకు ఏర్పాటు చేస్తున్న శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిని పూజించాలి. నవరాత్రులు స్వామి వారిని భక్తులు కొలిస్తే ఈ ఉపద్రవం నుంచి ప్రజలు కోలుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ విలయాన్ని తొలగించాలని స్వామిని కోరుకోవాలి. దివ్యజ్ఞాన సిద్ధాంతి (విఠలా శర్మ)
కాలాన్ని పురాణాల్లో సర్పంగా చూపించారు.నాగలోకం పాతాళంలో ఉంటుంది.అంటే భూమికి సంబంధించినది. ఆ భూమి నుంచి భయంకరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే కాలసర్ప రూపమైన నాగేశ్వరి అనుగ్రహం ఉండాలి. ఈ సారి కరోనా రూపంలో ఉన్న పీడ విరుగడ కావాలనే ఉద్దేశంతో కాల నాగేశ్వరి విగ్రహాన్ని స్వామి వారి ఎడమవైపున 15 అడుగుల ఎత్తుతో ప్రతిష్ఠిస్తున్నారు.
సుల్తాన్బజార్,జూలై 17: ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్రావు తెలిపారు. శనివారం సిద్ధ్దంబర్బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చవితి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈనెల 23న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.సెప్టెంబర్ 10న ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. నిమజ్జన సమయానికి రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు.కార్యక్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి రాఘవరెడ్డి,ఉపాధ్యక్షుడు రామరాజు,కరోడిమల్,కార్యదర్శి శశిధర్,సంయుక్త కార్యదర్శి మహేందర్,కోశాధికారి శ్రీరాం వ్యాస్, మీడియా కన్వీనర్ దీపక్కుమార్ తదితరు పాల్గొన్నారు.
శ్రీ కృష్ణుడు శ్రీచక్రార్చన సమయంలో కాళికా మాతను ధ్యానం చేసిన క్రమంలో ఆమె ఆవహించడం ద్వారా కాళి స్వరూపంలో మారిపోతారు. కాళికాదేవి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు ఉపద్రవాలను తొలగించే రూపంగా మహాగణపతి కుడివైపున కృష్ణ కాళీ విగ్రహాన్ని 15 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విశేషమేమిటంటే కృష్ణ కాళిని కొలుస్తున్నట్లుగా ఆయన మాతృమూర్తి యశోద అమ్మ దర్శనమిస్తారు. కృష్ణకాళి రూపంలో ఉన్న విగ్రహాలు ప్రపంచంలోనే అరుదు. అలాంటి రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తుండటం మరో విశేషం.