ఖైరతాబాద్, ఆగస్టు 20 : గంగమ్మ తల్లికి జేజేలు పలుకుతూ.. గంగపుత్రులు నిర్వహించిన తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆదివారం తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్రతువును ఖైరతాబాద్ చౌరస్తాలోని సప్తమాత దేవాలయం (ఏడుగుడులు) వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్ బాబుతో కలిసి ప్రారంభించారు. గంగా తెప్ప, జలపందిరితో గంగపుత్రులు, బోనాలతో మహిళలు వేలాదిగా హాజరై తెలంగాణ కళారూపాల మధ్య నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. రైల్వే గేట్, బడా గణేశ్, ఐమాక్స్ థియేటర్ మీదుగా సాగర్ ఒడ్డున ఉన్న గంగమ్మ దేవాలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్, సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మ తెప్పను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్ బాబు సాగర్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత రావు, మాజీ ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డి, తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పూస నరసింహ, చందు, శ్రీహరి,ధన్రాజ్, మత్స్య సహకార సొసైటీ ప్రతినిధులు పద్మ, అరుణ్ జ్యోతి, ఎం. రాజు, సదానందం పాల్గొన్నారు.