మియాపూర్, ఫిబ్రవరి 17 : ఐటీ జోన్ శేరిలింగంపల్లి విశ్వనగర సొబగులు దిద్దుకునేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే వందలాది ఐటీ కంపెనీలు, ఓఆర్ఆర్, అద్భుతమైన ఫ్లైఓవర్లు, దుర్గం చెరువు కేబుల్ వంతెన, ముచ్చట గొల్పే థీమ్ పార్కులు సహా ఇతర మౌలిక వసతులతో బల్దియాలో జోన్ తనదైన ముద్ర వేయగా.. తాజాగా మోడల్ కారిడార్ పనులతో కొత్త శోభను సంతరించుకోబోతున్నది. విశాలమైన రహదారులు కలిగి ఉండటంతో మరింత పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా మోడల్ కారిడార్లను తీర్చిదిద్దే పనులకు శ్రీకారం పడింది. ప్రజా సౌకర్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న సర్కారు శేరిలింగంపల్లి ఐటీ జోన్లో ఇలా ప్రత్యామ్నాయ, అధునాతన వసతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. వెస్ట్జోన్ శేరిలింగంపల్లి పరిధిలో మూడు ప్రాంతాలను మోడల్ కారిడార్లు తీర్చిదిద్దే పనులను చేపట్టారు. ఇందుకు సంబంధించిన పనులను గత నెల చివర్లోనే ప్రారంభించి.. ముమ్మరంగా కొనసాగేలా కసరత్తులు చేస్తున్నారు.
వెస్ట్జోన్ శేరిలింగంపల్లి పరిధిలో మూడు ప్రాంతాలలోని రహదారులను మోడల్ కారిడార్లుగా అభివృద్ధి పరిచేందుకు గతంలోనే ఎంపిక చేశారు. వాటిలో బయోడైవర్సిటీ నుంచి లెదర్ పార్కు వరకు రూ.6 కోట్లతో 2కిలో మీటర్ల మేర మోడల్ కారిడార్గా తీర్చిదిద్దుతున్నారు. 200 ఫీట్లకు పైగా ఉన్న ఈ రహదారిలో ఎడమవైపు ఫుట్పాత్, సైక్లింగ్ ట్రాక్, గ్రీనరీ, స్ట్రీట్ ఫర్నీచర్ను అభివృద్ధి పరుస్తున్నారు. తాజాగా దీనిని మోడల్ కారిడార్గా ఎంపిక చేయటంతో ఆ మేరకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నానక్రామ్ గూడ సర్కిల్ నుంచి ఐటీ హైట్స్, నానక్రామ్గూడ నుంచి ఖాజాగూడ చౌరస్తా వరకు రూ.10 కోట్లతో 2.7 కిలో మీటర్ల మేర మోడల్ కారిడార్ పనులను ప్రారంభించారు. ఈ దారిలో సుమారు 25 కు పైగా ఆస్తుల సేకరణను చేపట్టాల్సి ఉన్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందుకు సంబంధించిన పనులను ఇప్పటికే ముమ్మరంగా చేపడుతున్నారు. టీడీఆర్ అందివ్వటం ద్వారా ఆటంకాల్లేకుండా ముందుకు సాగేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇక్కడి మోడల్ కారిడార్లోనూ రహదారికి ఇరువైపులా ఫుట్పాత్లు, సైక్లింగ్ ట్రాక్, పచ్చదనం, స్ట్రీట్ ఫర్నీచర్ను అభివృద్ధి పరచనున్నారు. సీఎస్ఆర్ ద్వారా ఇందులో అందమైన, ఆకర్షణీయమైన బొమ్మల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జోన్ పరిధిలో 4.7 కిలో మీటర్ల మోడల్ కారిడార్ పనులను జూన్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలే మున్సిపల్ శాఖ స్పెషల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఈఎన్సీ జియావుద్దీన్లు ఇక్కడి మోడల్ కారిడార్ పనులను సైతం పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు.
వెస్ట్జోన్ శేరిలింగంపల్లి పరిధిలో మూడు రహదారులను మోడల్ కారిడార్లుగా తీర్చిదిద్దుతున్నాం. బయోడైవర్సిటీ -లెదర్ పార్కు, నానక్రామ్గూడ – ఐటీ హైట్స్, నానక్రామ్గూడ- ఖాజాగూడ వరకు ఈ పనులను రూ. 16 కోట్లకు పైగా నిధులతో 4.7 కిలో మీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నాం. మోడల్ కారిడార్లలో రహదారికి ఇరువైపులా ఫుట్ పాత్లు, సైక్లింగ్ ట్రాక్, గ్రీనరీ, స్ట్రీట్ ఫర్నీచర్లు అందుబాటులోకి వస్తాయి. జూన్లోగా కారిడార్ పనులన్నింటినీ పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. ఎప్పటికపుడు పనులను పరిశీలిస్తూ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ఎలక్ట్రికల్ విభాగాలకు తగు సూచనలిస్తూ పనులలో జాప్యానికి ఆస్కారం లేకుండా చూస్తున్నాం. కొన్ని ఆస్తులను సేకరించాల్సి ఉన్నందుకు ఆ ప్రక్రియను సైతం ముమ్మరం చేశాం.
– శంకరయ్య, జడ్సీ వెస్ట్జోన్ శేరిలింగంపల్లి