దేశ స్వాతంత్రోద్యమ కాలంలోని పలు సందర్భాలను గుర్తు చేస్తూ చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్ను తిలకించేందుకు విద్యార్థులు, యువకులు ఆసక్తి చూపుతున్నారు. సిపాయిల తిరుగుబాటు (1857-1904), వందేమాతర ఉద్యమం (1905), జలియన్ వాలాబాగ్ ఊచకోత(1919), సహాయ నిరాకరణ ఉద్యమం(1920), పూర్ణ స్వరాజ్ ప్రకటన(1929), శాసనోల్లంఘన ఉద్యమం(1950), ఉప్పు సత్యాగ్రహం (1941), క్విట్ ఇండియా (1942), భారత స్వాతంత్య్రోద్యమం(1947).. ఇలా అనేక సంఘటనలకు సంబంధించిన దాదాపు 200 అరుదైన చిత్రాలను భారత ప్రభుత్వ ఫొటో డివిజన్ నుంచి సేకరించి ప్రదర్శనలో పెట్టారు. ప్రభుత్వ పరంగా ఇలాంటి ప్రదర్శన నిర్వహించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్య్రోద్యమంలో సమరయోధుల పాత్రను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన చిత్రాలు చూడ చక్కగా ఉన్నాయి. ప్రదర్శనలోని ఛాయాచిత్రాలు మన పూర్వ చరిత్రను చెబుతున్నాయి. ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం మాలాంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగం. పోరాట యోధులు, వారి త్యాగాలను తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. – రాము మారెడు, సెంట్రల్ యూనివర్సిటీ ఎంఎఫ్ఏ విద్యార్థి
స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు, పూర్వ చరిత్ర, మహనీయుల విలువలు పౌరులకు గుర్తుచేసేలా ఈ ఫొటో ఎగ్జిబిషన్ ఉన్నది. భారత దేశపు అద్భుత చరిత్ర, సంస్కృతి గురించి గర్వించదగిన భావనను కలిగించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. – నారాయణరెడ్డి, హోంగార్డు
75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని స్మరించుకోవాలన్న భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. ఈ ప్రదర్శన ద్వారా భారత స్వాతంత్య్ర పోరాటంలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకోగలిగాను. – జలగం సుధీర్, ఎన్ఆర్ఐ, కోదాడ
భారత సంగ్రామంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, ఇతర ప్రముఖ నాయకుల పాత్రకు సంబంధించిన ఛాయాచిత్రాలు ప్రస్తుత యువతరానికి అవగాహన కల్పిస్తున్నాయి. ఈ ప్రదర్శనను యువతరం తప్పనిసరిగా వీక్షించి స్వాతంత్య్ర పోరాటంలోని వివిధ కీలక అంశాలను తెలుసుకోవాలి. – రోహిత్ వక్రాల, సామాజిక కార్యకర్త