సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ) : విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సర్కారీ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. నాణ్యమైన విద్య, చక్కటి మౌలిక వసతులు కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులకు ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ‘బడిబాట’ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 5,074 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందారు. శుక్రవారం ఒక్కరోజే అంగన్వాడీ కేంద్రాల నుంచి 113, ప్రైవేటు స్కూళ్ల నుంచి 64, నేరుగా అడ్మిషన్లు 250 వరకు ఉన్నట్లు డీఈవో తెలిపారు. కాగా, రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ) : జిల్లాలో బడిబాట కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కార్ బడుల్లో చేరేందుకు విద్యార్థులు జైకొడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1 నుంచి 9వ తరగతి వరకు దాదాపు 5,074 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందినట్లు డీఈవో ఆర్.రోహిణి వివరించారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక్కరోజే అంగన్వాడీ కేంద్రాల నుంచి 113, ప్రైవేటు స్కూళ్ల నుంచి 64, డైరెక్ట్ అడ్మిషన్లు 250 వరకు జరిగినట్లు తెలిపారు.
రేపటి నుంచి పునఃప్రారంభం
జిల్లాలో ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండటంతో జిల్లా విద్యాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్కూళ్లను, స్కూల్ పరిసరాలతోపాటు తాగునీటి సదుపాయాలు వంటి సకల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న మధ్యాహ్న భోజన పథకం కూడా జిల్లాలో తొలిరోజు నుంచే అమలుపరిచేలా మండలస్థాయి విద్యాధికారులను డీఈవో ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అమలు చేయాల్సిన అన్ని పథకాలు ప్రారంభిస్తున్నారు.
‘మనబస్తీ-మనబడి’తో ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి..
‘మన బస్తీ-మనబడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అన్ని స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. మరుగుదొడ్లు, తాగునీరు, కరెంటుతోపాటు క్లీన్ అండ్ గ్రీన్ ఉండే విధంగా గ్రీనరీ అమలు చేస్తున్నారు. స్కూళ్లకు జాతీయ నాయకులతో పెయింటింగ్ వేస్తున్నారు. పైగా ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఫలితాలు కూడా నమోదవుతున్నాయి. గత పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కూడా జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు నమోదైనట్లు డీఈవో తెలిపారు. పైగా జిల్లాల్లో ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన అందుబాటులో ఉంది. పదో తరగతి ఫలితాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పొందడానికి ఆసక్తి చూపుతున్నారని జిల్లా అధికారి తెలిపారు.