బంజారాహిల్స్,జూన్ 27: మరొకరితో గంటలకొద్దీ మాట్లాడుతుండగా.. అలా మాట్లాడవద్దని మందలించినందుకు.. తన భార్య ఇంట్లో నుంచివెళ్లిపోయిందని ఓ వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో తన భర్త కనిపించడం లేదంటూ మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది.. దీంతో ఆరా తీయగా వారిద్దరూ కలిసి వెళ్లిపోయినట్లు తేలడంతో వేర్వేరుగా మిస్సింగ్ కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్కతాకు చెందిన నారాయణ్దాస్, భార్య కలిసి నగరానికి వచ్చి వెంకటగిరిలో నివాసముంటున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు. కాగా.. గత ఏడాది కాలంగా ఆమె.. వెంకటగిరిలో నివాసముంటున్న ఆసిఫ్ అనే వ్యక్తితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండగా.. గుర్తించిన నారాయణ్దాస్.. భార్యను మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇటీవల ఈ విషయంపై పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు. కాగా.. ఈ నెల 24న ఇదే విషయంపై మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి కోల్కతా వెళ్లిపోయింది. దాంతో అక్కడ వాకబు చేయగా పిల్లలను కోల్కతాలోని తల్లితండ్రుల వద్ద వదిలిపెట్టిన ఆమె.. అక్కడనుంచి వెళ్లిపోయినట్లు తేలింది.
దాంతో నారాయణదాస్ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. అదే సమయంలో పోలీస్స్టేషన్కు వచ్చిన ఆసిఫ్ భార్య.. తన భర్త కనిపించడం లేదని, ఓ మహిళతో కలిసి వెళ్లినట్లు అనుమానంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆరా తీయగా ఆ ఇద్దరూ కలిసి వెళ్లినట్లు తేలింది. ఈ మేరకు వేర్వేరుగా కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.