మేడ్చల్, జనవరి29 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం దేశానికే ఆదర్శం కానుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం దళితబంధు పథకంపై కలెక్టర్ హరీశ్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కార్యచరణ సమీక్షా సమావేశాన్ని మంత్రి మల్లారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ దళితబంధు పథకం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా దళితబంధును విజయవంతంగా అమలు చేస్తామన్నారు. జిల్లాలో మొదటి విడతలో ఐదు నియోజకవర్గాలలో 5 వందల మందికి దళితులను దళితబంధు పథకానికి ఎంపిక చేస్తామన్నారు. వచ్చే ఫిబ్రవరి 5 వతేదీ వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి బ్యాంకు ఖాతాలు తెరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. ప్రభుత్వం అందించే రూ. 10 లక్షలతో 30 రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, ఆర్డీవోలు మల్లయ్య, రవి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల సమన్వయంతో లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. రూ.10 లక్షలలో మూడు యూనిట్లు పెట్టుకునే అవకాశం ఉంది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలకు గాను దళితబంధుకు రూ. 50 కోట్లు మంజూరు అయ్యాయి. పథకం పగడ్భందీగా అమలుకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించాం.
విప్లవాత్మకమైన నిర్ణయం
దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకం దేశానికి దిక్సూచిగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దళితులకు ముఖ్యమంత్రి తోడ్పాటు
దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి తోడ్పాటు అందించేందుకు దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఇం దుకు నిదర్శనం.
సమన్వయంతో పనిచేయాలి
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారుల కృషి ఎంతో ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించి తీరుతాం.