సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో ట్రాఫిక్ చిక్కులకు శాశ్వతంగా చెక్ పెట్టే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ రద్దీ ప్రాంతాల్లో నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న 221 ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా నూతనంగా 155 కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం రూ.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా 75 చోట్ల పనులను పూర్తి చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇటీవల బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈ నూతన సిగ్నల్స్ను ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఆటోమేటిక్గా ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అమలు కావడం దీని ప్రత్యేకత. ఏటీఏసీ వ్యవస్థను ట్రాఫిక్ సెంట్రల్ సర్వర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని, ఈ నెలాఖరులోగా ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
1500 చోట్ల ట్రాఫిక్ సైన్బోర్డులు
వీటితో పాటు రహదారి భద్రత చర్యల్లో భాగంగా ట్రాఫిక్ సూచికల(సైన్) బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. స్కూల్ జోన్, లెఫ్ట్, రైట్, ఇలా ఇప్పటి వరకు 1500 చోట్ల ట్రాఫిక్ సైన్బోర్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
100 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 221 ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో 155 , సైబరాబాద్ పరిధిలో 41, రాచకొండ పరిధిలో 25 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థకు సాంకేతికత జోడించి, ఆటోమేటిక్గా సిగ్నల్ వ్యవస్థ పనిచేయాలనే ఆలోచనతో హెచ్ట్రీమ్ ప్రాజెక్ట్తో 221 జంక్షన్లలో అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ట్రాఫిక్ తిప్పలు లేకుండా హైదరాబాద్లో సాఫీ ప్రయాణాలు సాగేలా చేశారు.
ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు వీటికి అదనంగా 155 ట్రాఫిక్కు, 100 (పాదాచారుల సౌకర్యార్థం) పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో 80, సైబరాబాద్ పరిధిలో 50, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 ఏర్పాటు చేస్తున్నారు. కెనడాకు చెందిన ఐబీఐ గ్రూప్ ఈ ప్రాజెక్టును చేపడుతున్నది.