సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డు వెంబడి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఐటీ కారిడార్లోని నానక్రాంగూడ ఇంటర్చేంజ్ నుంచి నార్సింగి మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఒక మార్గం, నార్సింగి నుంచి కోకాపేట, కొల్లూరు మీదుగా ఈదుల నాగులపల్లి వరకు మరో మార్గంలో సైకిల్ ట్రాక్ను నిర్మించారు.
రెండు మార్గాల్లో కలిసి మొత్తం 23 కి.మీ. మేర సైకిల్ ట్రాక్ను నిర్మించారు. సైకిల్ ట్రాక్పై నిర్మించిన రూఫ్పై ట్రాన్స్కో, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)ల నుంచి 16 మెగావాట్ల డీసీ విద్యుత్ ఉత్పత్తికి అనుమతి పొందామని, సుమారు 13 మెగావాట్ల ఏసీ సోలార్ విద్యుత్ వినియోగంలోకి వచ్చేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామని అధికారులు తెలిపారు. డిజైన్కు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో ఓఆర్ఆర్ వెంబడి సోలార్రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పనులు చేపట్టారు.
సోలార్ ప్యానల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్కు 6 చోట్ల సబ్స్టేషన్లు, మరో 72 వరకు ట్రాన్స్ఫార్మర్లకు అనుసంధానం చేయడం ద్వారా పవర్ గ్రిడ్కు సోలార్ విద్యుత్ వెళ్లేలా నిర్మాణాలు పూర్తి చేసింది. దానికి అనుగుణంగా 14-15 కి.మీ పరిధిలోనే సోలార్ ప్యానల్స్ను కాంట్రాక్టు సంస్థ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులో భాగంగా నిర్ణయించిన 13 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు. ప్యానల్స్ ఏర్పాటులో ఎలాంటి అవకతవకలు లేవని, చోరీ జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అధికారులు తెలిపారు.
26న రిపబ్లిక్ సైక్లింగ్ రైడ్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 26న హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్ ( హెచ్సీజీ ) ఆధ్వర్యంలో ‘దేశభక్తి చాటుదాం. సైక్లింగ్ ప్రోత్సహిద్దాం’ అనే థీమ్తో సైక్లింగ్ రైడ్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ సంస్థ ఫౌండర్ నందనూరి రవీందర్ గౌడ్ మంగళవారం తెలిపారు. సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ వద్ద ఈ రైడ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. సైక్లింగ్ రైడ్లో పాల్గొనే వారు 9885440308 నెంబర్ను సంప్రదించాలని చెప్పారు.