చిక్కడపల్లి, జూలై 2: సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని, ప్రణాళికతో, సమయాపాలన పాటిస్తూ చదివితే తప్పకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు అన్నారు. పట్టుదల, ప్రణాళికతో సాధనకు పూనుకోవాలని అలా చేస్తే దేనినైనా సాధించుకోవచ్చని ఆయన పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచించారు. తెలంగాణ ప్రజా గ్రంథాలయాల అభివృద్ధి సంఘం శనివారం సాయంత్రం అశోక్నగర్లోని నగర కేంద్ర గ్రంథాలయంలో గ్రూప్-1, గ్రూప్-2 ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవులు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించిందని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ఆయాచితం శ్రీధర్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు అవకాశం కల్పించిందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవి ప్రసాద్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు. నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి మాట్లాడుతూ, నగర కేంద్ర గ్రంథాలయంతో అనుబంధ గ్రంథాలయాల్లో అభ్యర్థులకు పుస్తకాలను అందుబాటులో పెట్టామని తెలిపారు.
సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవి ప్రసాద్రావు, నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, నగర గ్రంథాలయం సంస్థ కార్యదర్శి పి.జద్మజ, ప్రముఖ ఫ్యాకల్టీ డి.రవి శంకర్, ఉద్యోగ సంఘం శాగంటి అయోధ్య, కార్యదర్శి బొల్లం మహేందర్, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెంకటేశ్ యాదవ్, మదన్ మోహన్, ప్రజా గ్రంథాలయాల అభివృద్ధి సంఘం ఉపాధ్యక్షుడు టి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య, కార్యదరి సోమశివయ్య, నాగేశ్వర్రావు, పానుగంటి మురళీ కృష్ణ, ఆముక్త మాల్యద, షేక్ ఆడమ్ షఫి, వనం దుష్యంతల, నరసయ్య, కిష్టారెడ్డి, కవిత పాల్గొన్నారు.