చార్మినార్, ఫిబ్రవరి 4: మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై యూపీలో కాల్పులు జరిగిన ఘటనకు నిరసనగా పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు సాయుధ బలగాలను మోహరించి..భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలువురు నాయకులతో సమావేశమైన పోలీసులు.. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూశారు. మక్కామసీదులో ప్రార్థనలు చేసిన అనంతరం కొందరు అసదుద్దీన్ ఒవైసీకి అనుకూలంగా నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ బలగాలు, టాస్క్ఫోర్స్ సిబ్బంది వారిని సముదాయించి.. ప్రశాంతంగా ఇండ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.