అమీర్పేట్, ఫిబ్రవరి 4 : సనత్నగర్ నియోజవరర్గంలో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 12న ఉదయం 9 గంటలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, ఎస్ఎన్డీపీ, టౌన్ప్లానింగ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వర్షాల సమయంలో బేగంపేట నాలా పరిసరాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, తన దృష్టికి వచ్చిన వెంటనే బేగంపేట నాలా అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రకాశ్నగర్, అల్లంతోట బావి, బ్రాహ్మణవాడి, వడ్డెర బస్తీ, మాతాజీనగర్ ప్రాంతాల్లో వరదనీటి కాలువల నిర్మాణాలు, నాలా పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణాలకు రూ.45 కోట్లు మంజూరు చేశారని వివరించారు. ఈ నిర్మాణాలతో బేగంపేట పరిసరాల్లో వరద ముంపు సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. అడిగిన వెంటనే నిధులిచ్చి సహకరించినందుకు నియోజకవర్గం ప్రజల తరఫున మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
పికెట్ నాలాపై వంతెన
నియోజకవర్గం పరిధి ఎస్పీ రోడ్డులోని కరాచి బేకరీ దగ్గర పికెట్ నాలాపై రూ.10కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు, పాటిగడ్డలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఇవే కాకుండా నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పలు రహదారుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, వీటితో పాటు కాలనీ, బస్తీల్లోని అంతర్గత రహదారులను కూడా వీడీసీసీ రోడ్లతో అభివృద్ధి చేయాలని సమావేశంలో జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
రైల్వేశాఖ పెండింగ్ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష..
ఈ నెల 12వ తేదీన సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బుద్ధభవన్లో రైల్వే, జీహెచ్ఎంసీ, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షిస్తారని తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో రైల్వే, జీహెచ్ఎంసీ సంయుక్తంగా చేపట్టాల్సిన పనులపై ఆయా విభాగాల అధికారులతో మంత్రి కేటీఆర్ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యంగా రాణిగంజ్ వద్ద రూ.16.44 కోట్ల వ్యయంతో ఆర్యూబీ విస్తరణ, ఫతేనగర్ ఫ్లై ఓవర్ వద్ద నిర్మించనున్న మూడు లైన్ల ఆర్వోబీతో పాటు సనత్నగర్ పారిశ్రామికవాడ నుంచి నర్సాపూర్ చౌరస్తాను కలిపేందుకు వీలుగా రూ.45 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆర్యూబీ పనులపై సమీక్ష ఉంటుందని వివరించారు. వీటితో పాటు నగరంలో హెచ్ఆర్డీసీఎల్, ఎస్ఎన్డీపీ, ప్రాజెక్టుల విభాగాల ఆధ్వర్యంలో చేపడుతున్న పలు రైల్వే సంబంధిత పనులపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. ఆయా పనులకు సంబంధించిన అధికారులు తుది నివేదికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్, టౌన్ప్లానింగ్ సీసీపీ దేవేందర్రెడ్డి, ఎస్ఎన్డీపీ సీఈ వసంత, హెచ్ఆర్డీసీఎల్ సీఈ సరోజిని, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, రవికిరణ్, ఎస్ఈలు అనిల్రాజ్, రత్నాకర్, భాస్కర్ రెడ్డి, ఈఈ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.