కీసర, మే 27: నగర శివారు మున్సిపాలిటీల్లో రహదారులను విస్తరించేందుకు తగు చర్యలు చేపడుతున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో స్థానిక మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లతో కలిసి శుక్రవారం పర్యటించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా – ఘట్కేసర్ రహదారి, దమ్మాయిగూడ చౌరస్తా నుంచి దమ్మాయిగూడ మున్సిపాలిటీ వరకు గల ప్రస్తుత రహదారులను పరిశీలించారు. ఈ రహదారులను విస్తరించేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రహదారులను 100 నుంచి 200 అడుగుల వరకు ఎంత అవసరమో గుర్తించి మ్యాప్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జవహర్నగర్ డంపింగ్యార్డు వల్ల దమ్మాయిగూడలోని బోర్ల నీరు పూర్తి కలుషితం అవుతుందని, దమ్మాయిగూడ పురపాలక సంఘానికి ఉచితంగా గోదావరి నీరు సరఫరా చేయాలని స్థానిక నేతలు అర్వింద్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
క్రీడా ప్రాంగణం, నర్సరీల పరిశీలన..
నాగారం మున్సిపాలిటీ పరిధిలో..రాంపల్లి ఆర్టీసీ కాలనీల్లో క్రీడా ప్రాంగణం పనులు, శిల్పా వెంచర్లోని నర్సరీ, రాంపల్లి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. మున్సిపాలిటీ అన్యాక్రాంతమవుతున్న పార్కు స్థలాన్ని రక్షించాలని స్థానికులు అర్వింద్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఆర్డీసీఎల్ ఈఎన్సీ జియావుద్దీన్, హెచ్ఆర్డీసీఎల్ ఎస్ఈ సరోజారాణి, టౌన్ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ రమేశ్ బాబు, నాగారం, దమ్మాయిగూడ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, ప్రణీతాగౌడ్, కమిషనర్లు వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు మల్లేశ్ యాదవ్, నరేందర్ రెడ్డి, డిప్యూటీ ఇంజినీర్ రఘు, మేనేజర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు. శుక్రవారం జవహర్నగర్లో ఆకస్మికంగా పర్యటించి పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. డంపింగ్యార్డ్ పరిసర ప్రాంతాలు, దమ్మాయిగూడకు వెళ్లే రోడ్డు, రాజీవ్గృహకల్ప, నర్సరీలను పరిశీలించి..పలు సూచనలు చేశారు. ఆయన వెంట మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.