సైదాబాద్, మే 23 : ఇంటిముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. అప్పటివరకు కండ్లెదుటే చిట్టిపొట్టి మాటలు, బుడిబుడి అడుగులతో అల్లరిచేస్తూ తిరిగిన చిన్నారి కానరాని లోకానికి చేరింది. రక్తపు మడుగులో విగత జీవిగా పడిఉన్న చిన్నారిని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం సాయం త్రం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని గొట్టిముక్కల తండాకు చెందిన రమావత్ రవి, రమావత్ మధు దంపతులు బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి సైదాబాద్ ఖాజాబాగ్ గుడిసెల్లో నివాసముంటున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు రమావత్ పవనశ్రీ (3), కుమారుడు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా, భార్య మధు గృహిణి. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం స్థానికంగా జెర్పుల వాల్యా అనే వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం కోసం డీసీఎం లారీలో సిమెంట్ బ్యాగులు తెప్పించారు. అన్లోడ్ చేసిన అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని నడిపి ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి పైనుంచి తీసుకు వెళ్లాడు. లారీ చక్రాల కింద పడిపోయిన చిన్నారి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.