మియాపూర్, మే 22 : శేరిలింగంపల్లి మండలంలో సర్కారు పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు శ్రీకారం పడనున్నది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని ప్రకటించిన నేపథ్యంలో.. పాఠశాలలు మరింత పురోగతి దిశగా అడుగులు వేసేందుకు సిద్ఢం అవుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన శేరిలింగంపల్లి మండలంలో ఈ పథకానికి తగు నిధులు మంజూరు చేయాలన్న విప్ అరెకపూడి గాంధీ అభ్యర్థన సత్ఫలితాలను ఇచ్చింది. రెండు మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ‘మన ఊరు మన బడి’ సమీక్ష సమావేశంలో మండలంలో తొలి దశలో ఎంపికైన 24 పాఠశాలలకు కల్పించాల్సిన వసతులపై విప్ గాంధీ మంత్రి సబితా రెడ్డి, సహా జిల్లా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లటంతో నిధుల సైతం తక్షణమే విడుదలయ్యాయి. మండలంలో పాఠశాలల్లో వసతులకు రూ.4.82 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో విద్యాశాఖ అధికారులతో విప్ గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించి పనులను ప్రారంభించాలని సూచించారు.
అదనపు గదులు..తాగునీరు..టాయిలెట్లు
శేరిలింగంపల్లి మండలంలో ప్రభుత్వం తొలి విడతగా రూ. 4.82 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో త్వరలో పనులు సైతం ప్రారంభం కానున్నాయి. వీటిలో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు, ప్రహరీ నిర్మాణం, డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, ర్యాంప్లు, లైబ్రరీలు, పాఠశాలలకు ఆకర్షనీయమైన రంగులు వంటి వసతులను కల్పించనున్నారు. గత నెల రోజుల పాటు అధికారులు పాఠశాలల్లో క్షేత్రస్థాయి అవసరాలను గుర్తించి చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి నివేదికను సైతం సమర్పించారు. అనంతరం నిధుల మంజూరుపై ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు సైతం సఫలం కావటంతో పనులు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, చైర్మన్ల నేతృత్వంలో సంయుక్త బ్యాంక్ అకౌంట్ను తెరిచే ప్రక్రియ ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేసుకుని త్వరలో పనులను ప్రారంభించనున్నారు.
పూర్తి స్థాయిలో సౌకర్యాలను కల్పిస్తాం..
శేరిలింగంపల్లి మండలంలో ‘మన ఊరు మన బడి’ కింద తొలి దశలో 24 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.4.82 కోట్ల నిధులను మంజూరు చేసింది. వీటి వినియోగం .. వసతుల కల్పనపై విద్యాశాఖ అధికారులతో సమావేశాలను నిర్వహించి దిశా నిర్దేశం చేశాం. ప్రతి రూపాయిని సమర్థంగా వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులను కల్పిస్తాం. ప్రైవేటుకు దీటుగా సౌకర్యాల పరంగా సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దుతాం. నిధుల వినియోగం పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించాం.
– అరెకపూడి గాంధీ, ప్రభుత్వ విప్