సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): లుంబినీ పార్కు… ఎన్టీఆర్ గార్డెన్… ట్యాంక్బండ్…సంజీవయ్య పార్కు… నెక్లెస్ రోడ్డు… జల విహార్… పీపుల్స్ ప్లాజా… ఇలా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పలు ప్రాంతాలు నిత్యం సందర్శకులతో సందడిగా ఉంటాయి. నగరవాసులకే కాకుండా దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు సాగర్ అందాలను ఆస్వాదిస్తుంటారు. అలాంటి హుస్సేన్సాగర్లోని జలాలు మురుగునీటితో కలుషితం కాకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా సాగర్ తీరంలో ఎక్కడికి వెళ్లినా దుర్గంధంతో కూడిన వాసన గుప్పుమంటూ వస్తోంది. దీంతో ఆచుట్టు పక్కల ప్రాంతాల్లో కొద్ది సేపైనా సేద తీరే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు హుస్సేన్సాగర్ తీరంలో ఎక్కడికి వెళ్లినా దుర్వాసన రావడం, దాన్ని అరికట్టేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఈసారి ఫిబ్రవరి నుంచే ఎండలు మొదలై, మార్చిలోనే 40 డిగ్రీలు దాటుతున్న పరిస్థితి. దీంతో ఎండల తీవ్రతకు హుస్సేన్సాగర్లోని మురుగునీరు ఎక్కడికక్కడ పేరుకుపోయి తీవ్రమైన స్థాయిలో దుర్వాసన వస్తోందని పర్యాటకులు వాపోతున్నారు. కుటుంబంతో కలిసి సాయంత్రం వేళ సరదాగా సాగర తీరానికి వచ్చే వారు దుర్గంధంతో కూడిన వాసనను భరించలేకుండా పోతున్నామని అంటున్నారు.
హెచ్ఎండీఏ నిర్లక్ష్యం….
హుస్సేన్సాగర్లోకి మురికి నీరు రాకుండా ఆపడం సాధ్యం కాదు. అయితే వచ్చే నీటిని శుద్ధి చేసి వ్యర్థాలను తీసివేస్తే కొంత వరకు ఆ ప్రయత్నంలో విజయం సాధించినట్లే. మురుగునీటి లేని సాగర్ను చూడాలని, దుర్వాసన లేని సాగర్ పరిసరాల్లో విహరించాలని సగటు హైదరాబాదీ కల. ఏటా ప్రభుత్వాలు ఇందుకోసం చేస్తున్న ప్రయత్నాలు మొక్కుబడిగా ఉంటున్నాయే తప్ప, శాశ్వత దిశగా చర్యలు ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. ఏటా సాగర్ శుద్ధి కోసం కోట్లాది రూపాయలను హెచ్ఎండీఏ వెచ్చిస్తున్నది. అయినా వేసవి వచ్చే సరికి అదే సమస్య పునరావృతమవుతున్నది. హుస్సేన్సాగర్ను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను చేపట్టిన హెచ్ఎండీఏ.. ఆ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రతపై ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఆలస్యంగా మేల్కొన్న అధికారులు…
హుస్సేన్సాగర్లోకి వచ్చే చేరే మురుగునీటికి చెక్ పెట్టేందుకు హెచ్ఎండీఏ చాలా ఆలస్యంగా చర్యలు చేపట్టింది. ఈనెల మొదటి వారంలో హుస్సేన్సాగర్ శుద్ధి, నిర్వహణకు సంబంధించిన ప్రత్యేకంగా టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం మొత్తం రూ.రూ.7.19 కోట్లను వెచ్చిస్తున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా మూడు చోట్ల ఉన్న ఎస్టీపీలతో పాటు మొత్తం 7 చోట్ల ఉన్న ఐ అండ్ డీల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. ఇప్పటికీ ఆ పనులు క్షేత్ర స్థాయిలో మొదలుకాకపోవడంతో ప్రస్తుతం ఎండల తీవ్రతకు సాగర్ తీర ప్రాంతంలో ఎక్కడ నిల్చున్నా దుర్గంధం వెలువడుతోంది. దీంతో నిత్యం వేలాదిగా వచ్చే పర్యాటకులు సాగర్ వైపు రావాలంటేనే ముక్కు మూసుకొని ఉండాల్సి వస్తోందంటున్నారు.ఇప్పటికైనా హెచ్ఎండీఏ అధికారులు యుద్ధ ప్రాతిపదికన హుస్సేన్సాగర్ తీర ప్రాంతాల్లో దుర్వాసన వస్తున్న చోట చర్యలు చేపట్టాలని నగర వాసులు కోరుతున్నారు.