గులాబ్ తుపాను నగరంపై విరుచుకుపడినా ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆస్తి,ప్రాణనష్టం తప్పింది. బల్దియా, జలమండలితోపాటు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించడం, ప్రజలు ఇండ్ల నుంచి బయటకురాకుండా మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించడంతో పెద్ద ఊరట లభించింది. కలిసికట్టుగా వ్యవహరిస్తే ఎంతటి ఉపద్రవాన్నయినా ఎదుర్కోవచ్చని నిరూపించింది.ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు గ్రేటర్వ్యాప్తంగా కుంభవృష్టి కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. కాలనీల్లో వరద ఉప్పొంగినా సిబ్బంది శ్రమించి రెండుమూడుగంటల్లోనే సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారు. వరద పోటెత్తుతుండటంతో ముందస్తుగా మూసారాంబాగ్, చాదర్ఘాట్ దిగువ వంతెనలను మూసివేశారు. మంత్రులు తలసాని, సబితారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లు విజయలక్ష్మి, శ్రీలత, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఎడతెరిపిలేని వర్షానికి చెరువులు చెరువులు, కుంటలు మత్తడి పోయడంతో పాటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ నిండుకుండలా మారింది. జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తడంతో… దిగువ మూసీలోకి ఏకకాలంలో 9800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గగన్పహాడ్ వద్ద అప్పా చెరువు కట్టకు గండి పడడం.. వరదనీటితో పోటెత్తుతున్న నాలాలు, డ్రైనేజీలు, చెరువులను తలపిస్తున్న రోడ్లుతో లోతట్టు ప్రాంతాల జనానికి కంటిమీద కునుకులేకుండా పోయింది. శిథిల, పురాతన భవనాలు, అపార్ట్మెంట్ల సమీప బాధితులు ఏ క్షణానా ఏ ఘటన జరుగుతుందోనని ఆందోళన చెందారు.
కానీ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి ప్రజలపై తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి‘ఆపరేషన్ గులాబ్’ను విజయవంతం చేశారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లవచ్చని అంచనాల నడుమ రంగంలోకి దిగి, ఎక్కడ ఎలాంటి ఘటన జరగకుండా సహాయక చర్యలు చేపట్టి ప్రజలతో హ్యాట్సాఫ్ అనిపించుకున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించి, అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రాఫిక్, వరద కష్టాలు లెక్కచేయకుండా మరమ్మతు పనులు చేసి అసాధారణ పరిస్థితులను సాధారణ స్థితిలోకి తీసుకువచ్చారు.
గులాబ్ తుఫాన్ దిశను తెలంగాణ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల వైపు మళ్లడంతో హైదరాబాద్ ప్రజలు ఒకింత ఉపశమనం పొందారు. సోమవారం రోజంతా దంచికొట్టిన వానతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం..మంగళవారం వాన లేకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. గులాబ్ తుఫాన్ వాయుగుండంగా మారి బలహీనపడిందని, దాని ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
వానలతో తలెత్తిన ఇబ్బందులకు అధికారులు తక్షణ పరిష్కారం చూపారు. వివిధ ప్రాంతాల నుంచి గ్రీవెన్స్ సెల్కు సోమవారం రాత్రి వరకు 411 ఫిర్యాదులు రాగా, మంగళవారం 37 ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కారం చూపారు. మూసీ పరివాహాక ప్రాంతమైన ముసారంబాగ్ నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు 128 స్టాటిక్ బృందాలు రంగంలోకి దిగి వ్యర్థాలను తొలగించగా, మరో 128 మినీ మొబైల్ బృందాలతో విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించారు. లోతట్టు ప్రాంత ప్రజలను మలక్పేట, ఇతర పునరావాస కేంద్రలకు సురక్షితంగా తరలించారు.
రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు స్థానికంగా సమస్యాత్మక ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు జీహెచ్ఎంసీ మరమ్మతు చర్యలు చేపడుతోంది. వారం రోజుల వ్యవధిలో 546 చోట్ల రహదారులపై గుంతలు ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం రహదారులపై నీటిని, పేరుకుపోయిన ఇసుక, మట్టిని తొలగించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బుధవారం నుంచి మరమ్మతు చర్యలు చేపడతామని ఇంజినీరింగ్ విభాగం అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 8661 చోట్ల గుంతలను పూడ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.