సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ ) : పారిశుధ్య నిర్వహణలో బల్దియా ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణలను తీసుకొస్తున్నది. ప్రజలు రోడ్లపై చెత్తవేయడాన్ని నిలువరించేందుకు ఇప్పటికే 900 డబ్బాలను తొలగించగా, నగరాన్ని బిన్ రహితంగా మార్చే చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందులోభాగంగా ఇంటింటి వ్యర్థాల సేకరణకు ప్రస్తుతమున్న 3150 స్వచ్ఛ ఆటో టిప్పర్లకు అదనంగా మరో 1350 వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నది. వీటి కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసి.. రోడ్లపైకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆటోల ద్వారా సుమారు మూడు మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించనున్నారు.