సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేసే ప్రజలకు త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జీహెచ్ఎంసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పారిశుధ్య సమస్యలను ఇప్పుడు పౌరులు నేరుగా వాట్సాప్ ద్వారా జీహెచ్ఎంసీకి తెలియజేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై చెత్త పేరుకుపోవడం, చెత్త బిన్లు నిండిపోవడం, చెత్త సకాలంలో తొలగించకపోవడం, మురుగునాలాలు మూసుకుపోవడం ( డీసిల్టింగ్ అవసరం) గ్రీన్ వెస్ట్ తొలగింపు వంటి పారిశుధ్య సమస్యలను పౌరులు సులభంగా తెలుపవచ్చని సూచించారు.
సమస్యకు సంబంధించిన ఫొటోతో పాటు లొకేషన్ను 81259 66586 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారని చెప్పారు. ఈ వాట్సాప్ సౌకర్యం ద్వారా పౌరులు ఎలాంటి కార్యాలయాలకు వెళ్లకుండా, సులభంగా తమ ప్రాంతాల్లో ఉన్న పారిశుధ్య సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకువచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పారిశుధ్య బృందాలను అప్రమత్తం చేసే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.