సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) గ్రేటర్లో వరద కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఇందులోభాగంగానే వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సర్కారు..వరద నీరు సాఫీగా మూసీలోకి వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టేందుకు రూ. 858 కోట్లు కేటాయించింది. 15 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రూ. 267. 07 కోట్లతో పనులు జరుగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో రెండు ప్రధాన నాలాలపై ఐదు చోట్ల వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ. 28 కోట్ల పనులకు ఎస్ఎన్డీపీ టెండర్లు ఆహ్వానించింది. ట్యాంక్బండ్ రోడ్ నుంచి కళాసిగూడ మధ్య మూడు చోట్ల (అంచనా వ్యయం రూ.16కోట్లు), వీఎస్టీ నుంచి విద్యానగర్ రోడ్ మధ్య నల్లపోచమ్మ గుడి సమీపంలో, కూరగాయల మార్కెట్రోడ్లో (రూ.12 కోట్లు) వంతెనలు నిర్మించనున్నారు.