బన్సీలాల్పేట్, మార్చి 16 : నిరుద్యోగులు ఉచిత నై పుణ్య శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని బ న్సీలాల్పేట్ కార్పొరేటర్ కుర్మ హేమలత అన్నారు. టెక్ మహీంద్రా ఫౌండేషన్, అప్సా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బోయిగూడలో ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు అవగాహన శిబిరాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. అనంతరం పలువురు నిరుద్యోగులకు ఈ కోర్సుల గురించి వివరించి, ఆసక్తి ఉన్న వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ శిబిరంలో టీఆర్ఎస్ నాయకులు కె.లక్ష్మీపతి, అప్సా శిక్షణా కేంద్రం మేనేజర్ షేక్ మౌలా, సిబ్బంది వందన, మహేందర్, అభిషేక్, చందన పాల్గొన్నారు.
ఈ ఉచిత శిక్షణ కోసం అర్హులైన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని భోలక్పూర్లోని శిక్షణా కేంద్రం మేనేజర్ షేక్ మౌలా తెలిపారు. 10వ తరగతి పాసై, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన 19 నుంచి 27 ఏండ్ల వయస్సు ఉన్న యువతీయువకులకు 100రోజుల పాటు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, ఇంటర్నెట్, రిటైల్ రంగాల్లో నిపుణులైన అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందించి, 100 శాతం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా అందించే ఈ శిక్షణ కోసం ఆసక్తి గల అభ్యర్థులు 84980 89786లో సంప్రదించాలని కోరారు. గాంధీ దవాఖాన ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ సమీపంలోని ఎవర్గ్రీన్ కమ్యూనిటీ హాలులో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
నేను బోయిగూడలో ఉంటాను. మా నాన్న ఆటోడ్రైవర్. ఆయన సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. డిగ్రీ పూర్తి చేసిన నేను, భోలక్పూర్లోని అప్సా, టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ కేంద్రంలో చేరి మూడు నెలల ఉచిత కోర్సులో అంగ్ల భాషపై, కంప్యూటర్, టైపింగ్లపై పట్టు సాధించాను. నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. శిక్షణ అనంతరం ఏజీఎస్ అనే ప్రైవేట్ సంస్థలో నెలకు రూ.17 వేల జీతంతో ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడు నేను మా కుటుంబానికి అండగా ఉన్నాను. -సంధ్య, బోయిగూడ
నాన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. నేను డిగ్రీ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా, అప్సా, టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ కేంద్రంలో అందిస్తున్న ఉచిత కోర్సుల గురించి దినపత్రికలో చదివాను. వెంటనే అందులో చేరి, మూడు నెలల్లో ఇచ్చిన శిక్షణ వలన కంప్యూటర్ పరిజ్ఞానం పెరిగింది. ఇంటర్వ్యూలో పాసైన నాకు టెక్ మహీంద్ర సంస్థలో ఉద్యోగం లభించింది. నెలకు రూ.18 వేలు జీతం వస్తుంది. -పరిమళ, బాలంరాయి