కొన్నిరోజులుగా గ్రేటర్వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గంటల్లోనే 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. భారీ వర్షాలతో రహదారులపై వరద చేరుతున్నా వెంటనే దిగువకు ప్రవహిస్తున్నది. కాలనీల్లోకి నీళ్లు చేరుతున్నా ఒకట్రెండురోజుల్లోనే ఖాళీ అవుతోంది. ఫలితంగా నగరవాసులు ముంపు బాధల నుంచి ఉపశమనం పొందుతున్నారు. గతేడాది అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. వందలాది కాలనీలు రోజుల తరబడి నీటిలోనే ఉండిపోయాయి. వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.858 కోట్లతో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ప్రారంభించింది. తొలివిడుత రూ.200 కోట్లతో నాలాల ఆధునీకరణ, ట్రంక్లైన్ల నిర్మాణం, చెరువుల మరమ్మతు, సుందరీకరణ, తూముల వెడల్పు పనులు ప్రారంభించగా, ఇప్పటికే పలుచోట్ల పూర్తికావొచ్చాయి. పనులు పూర్తవుతున్న చోట ఫలితం కనిపిస్తోంది. ఇండ్లల్లోకి నీళ్లు చేరడం, రోజుల తరబడి కాలనీలు మునగడం వంటి వెతలు ఒక్కోటి తీరుతున్నాయి.
వర్షం వస్తే ఆ కాలనీలు చిగురుటాకులా వణికిపోయేవి. వరద ఉధృతికి మునిగిపోయేవి. మోకాలు లోతు నీటిలో మునిగి అల్లాడేవి. ఇదంతా సమైక్య రాష్ట్రంలోని ముంపు ప్రాంత ప్రజల బాధలు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ప్రస్తుతం ఆ సమస్యలేవీ లేవు. భారీ వర్షాలతో ముంపునకు గురవుతున్న కాలనీలను గుర్తించిన అధికారులు.. సమస్య మూలాలను తెలుసుకున్నారు. నాలాలను విస్తరించడంతో పాటు పూడిక తీశారు. రిటర్నింగ్ వాల్ల నిర్మాణంతో పాటు బాక్స్ డ్రైన్లు ఏర్పాటు చేశారు. చెరువుల అలుగుల ఎత్తు పెంచారు. గొలుసు కట్టు చెరువులను అనుసంధానం చేస్తూ వరద కాలువలు నిర్మించారు. ఇలా నగరంలో ముంపు ప్రాంతాల్లో సమస్యలు దూరం చేస్తున్నారు. – సిటీ న్యూస్ నెట్వర్క్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 8: గతంలో కురిసిన భారీ వర్షాలకు మూసాపేట సర్కిల్లో 13 కాలనీలు, కూకట్పల్లి సర్కిల్లో 18, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 9, గాజులరామారం సర్కిల్లో 6 , అల్వాల్ సర్కిల్లో 12 .. మొత్తం 58 కాలనీలు ముంపునకు గురయ్యేవి. దీంతో ఇందుకు గల కారణాలను గుర్తించిన అధికారులు రూ.20.99 కోట్లతో మరమ్మతులు చేపట్టారు.
బండ్లగూడ,సెప్టెంబర్ 8 : గత ఏడాది రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అప్పచెరువు, పల్లె చెరువులు తెగిపోవడంతో కాలనీలు జలమయమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు పల్లె చెరువు నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించారు. అవసరమైన చోట బాక్స్ డ్రైన్ను నిర్మించారు. అప్ప చెరువులోనూ ఆక్రమణలను గుర్తించిన అధికారులు వాటిని తొలగించారు. అప్ప చెరువుపై కట్ట నిర్మాణం కూడా చేస్తున్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలో సున్నం చెరువు దిగువ నుంచి మైసమ్మ వరకు ఉన్న నాలా పొంగగా గాయత్రీనగర్, జ్యోతినగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించి కల్వర్టును నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరద నీరు సాఫీగా వెళ్తోంది.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో భారీ వర్షలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సర్కిల్ పరిధిలో ఐదు మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేసి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారానికి చర్యలుతీసుకుంటాం.- డిప్యూటీ కమిషనర్ జగన్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: భారీ వర్షం కురిసిందంటే సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తా జల దిగ్బంధంలో చిక్కుకునేది. వరద ఉధృతితో హుస్సేన్సాగర్లోని నీరు వెనక్కి రావడంతో ఈ సమస్య ఉత్పన్నమయ్యేది. అయితే ప్రస్తుత కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ చొరవ తీసుకొని రూ.12 లక్షలతో అన్సారీ మసీదు ప్రాంతంలో మూడు రేయిన్ వాటర్ బావులను నిర్మించారు. వాటికి మూడు మోటార్లు అమర్చి వరద నీటిని తోడేస్తూ.. కాలనీ ముంపు సమస్యను తప్పించారు.
కొండాపూర్, సెప్టెంబర్ 8: చందానగర్ డివిజన్లోని తారానగర్, దీప్తిశ్రీనగర్ కాలనీల్లో వరదలు పోటెత్తేవి. తారాగనగర్లో రూ. 40 లక్షలతో, దీప్తిశ్రీనగర్ కాలనీల్లో రూ. 12 లక్షల వ్యయంతో వరదనీటి కాలువల నిర్మాణాలను పూర్తి చేశారు.
మల్కాజిగిరికి ఉపశమనం ఎమ్మెల్యే దూరదృష్టితో తప్పిన వరద ముప్పు
మల్కాజిగిరి, సెప్టెంబర్ 8: గతంలో మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని దుర్గానగర్ నాలాపై నుంచి వరద నీరు పొంగి రాకపోకలు ఆగిపోయాయి. గౌతంనగర్ డివిజన్ పరిధిలోని జ్యోతినగర్, యాదవనగర్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయేవి. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దూరదృష్టి కారణంగా ముంపు సమస్య నుంచి మల్కాజిగిరి వాసులకు ఉపశమనం లభించింది. మల్కాజిగిరిలో కోట్లాది రూపాయలతో బాక్స్ డ్రైనేజీల నిర్మాణంతో పాటు ప్రధాన నాలాలను డీసిల్టింగ్ చేయించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాలాల్లో చెత్త వేయకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు నాలాల నుంచి వరద నీరు సాఫీగా వెళ్తున్నది.
ఎల్బీనగర్, సెప్టెంబర్ 8: ఎల్బీనగర్ పరిధిలోని పలు కాలనీల్లో వరద ముంపు తప్పించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. జోన్ పరిధిలో రెండు మీటర్ల లోపు ఉన్న 117 వరదనీటి కాలువల పనులకు రూ.71.61 కోట్లు.. రెండు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న 20 వరద నీటి కాల్వల పనులకు రూ.15.26 కోట్లు మంజూరయ్యాయి.
హయత్నగర్ సర్కిల్ పరిధిలో 15 పనులకు రూ.10.56 కోట్లు, సరూర్నగర్ సర్కిల్లో 20 పనులకు రూ.62 కోట్లు, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో 10 పనులకు రూ.16.88 కోట్లు మంజూరయ్యాయి.
మన్సూరాబాద్ చిన్న చెరువు నుంచి బండ్లగూడ చెరువు వరకు కాలువలు నిర్మించేందుకు రూ.6.69 కోట్లు, బండ్లగూడ చెరువు నుంచి నాగోలు చెరువు వరకు రూ.7.26 కోట్లు, బండ్లగూడ నుంచి మూసీ వరకు రూ. 30.08 కోట్లు, బాతుల చెరువు నుంచి ఇంజాపూర్ నాలా వరకు రూ. 9.65 కోట్లు, చంద్రాగార్డెన్ నుంచి సరూర్నగర్ చెరువు, వంగ శంకరమ్మ గార్డెన్ నుంచి సరూర్నగర్ చెరువు వరకు రూ. 28.10 కోట్లు, సరూర్నగర్ చెరువు నుంచి చైతన్యపురి వయా జడ్సీ కార్యాలయం, సరూర్నగర్ చెరువు నుంచి చైతన్యపురి బ్రిడ్జి, కోదండరాంనగర్ వరకు రూ.21.47 కోట్లు మంజూరయ్యాయి.
నాగోలు డివిజన్లో ప్రధాన ముంపు ప్రాంతంగా ఆదర్శనగర్కాలనీ ఉండేది. ఈ సమస్యను తప్పించేందుకు ప్రభు త్వం అలుకాపురి నుంచి మూసీ వరకు రూ.12 కోట్లతో బాక్స్ డ్రైన్ నిర్మించింది. మరో రూ.5 కోట్లతో ఆదర్శనగర్ కాలనీ ఆర్చి నుంచి నాగోలు చౌరస్తా మీదుగా మూసీ వరకు మరో బాక్స్ డ్రైన్ నిర్మాణంతో సమస్య తొలగింది. ఇక కాలనీలోని భవ్య పాఠశాల నుంచి ఆదర్శనగర్ రోడ్ నంబర్ 1 వరకు రూ.1.40 కోట్ల తో మంజూరైన 1200 ఎంఎం డయా పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి అయితే కాలనీలో ఇక ముంపే ఉండదు.
అబిడ్స్/ మెహిదీపట్నం, సెప్టెంబర్ 8: జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ 12,13,14 సర్కిళ్ల పరిధిలోని జీహెచ్ఎంసీ అధికారులు నాలాల పూడికతీత పనులు చేపట్టారు. దీంతో ఎంత భారీ వర్షం కురిసినా ఎక్కడా ముంపు అన్నదే లేకుండా పోయింది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు నదీం కాలనీ, విరాసత్ కాలనీ, బాల్రెడ్డి నగర్, చాబ్రా ఎన్క్లేవ్, శాతం నగర్, ఎండీ లైన్స్, రంగ్మహల్ చౌరస్తా, తోప్ఖానా, నాంపల్లి కంట్రోల్ రూం, మొజాంజాహి మార్కెట్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. అయితే వరద నీటి ఇబ్బందులు తొలగించేందుకు అహ్మద్నగర్ మీదుగా సాగే బల్కాపూర్ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. అఫ్జల్సాగర్, తోప్ఖానా, మాలకుంట, హీరానగర్, శివలాల్నగర్ తదితర నాలాలు పొంగకుండాప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శాతం చెరువు నిండినా నీరు బస్తీలలోకి ప్రవహించకుండా చర్యలను చేపట్టారు. అంతేగాక నాలాల పూడికతీత పనుల పర్యవేక్షణ కోసం ప్రతి జోన్కు ఓ ఇంజినీరింగ్ సీఈ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు.
జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 8 : యూసుఫ్గూడలో వరద నీరు ఎక్కడా నిలువకుండా బల్దియా అధికారులు మాస్టర్ ప్లాన్తో భారీ బాక్స్టైప్ డ్రైన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు రూ.కోటి 90 లక్షల వ్యయంతో యూసుఫ్గూడ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ నుంచి ఆర్సీసీ బాక్స్టైప్ డ్రైన్ పనులు చేపట్టనున్నారు. ఈ డ్రైన్ను కోట్లవిజయభాస్కర్రెడ్డి స్టేడియం, యూసుఫ్గూడ మెయిన్ రోడ్, ఎల్ఎన్ నగర్ నాలా వరకు సుమారు 3 మీటర్ల వెడల్పుతో 200 మీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీనితో కృష్ణానగర్, వెంకటగిరి, యూసుఫ్గూడ ప్రాంతాలలో వరద నీటి ముంపు సమస్య తొలగనుంది.
రహ్మత్నగర్ డివిజన్లో రూ.కోటి 98 లక్షలతో వేర్వేరు ప్రాంతాల్లో 600 ఎంఎం డయాతో 5 స్ట్రామ్ వాటర్ డ్రైన్లకు రూపకల్పన చేశారు. దీంతో రహ్మత్నగర్ డివిజన్ శ్రీరాంనగర్, కార్మికనగర్, బ్రహ్మశంకర్ నగర్లకు భారీ వరద ముంపు ప్రమాదం తప్పింది.
వరదనీటిలో మునిగిపోయే కార్మికనగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చొరవతో వందలాది గుడిసెవాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారు.
హఫీజ్పేట్, సెప్టెంబర్ 8 : హఫీజ్పేట్ డివిజన్లో ప్రతీసారి వరద ముంపునకు అతిగా ప్రభావితమయ్యే జనప్రియనగర్, రామకృష్ణనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నాలాలను విస్తరించడంతో పాటు వరదనీటి కాల్వల పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో వరద నీరు సాఫీగా వెళ్తుంది. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రజలు వారి దినచర్యలను సవ్యంగా సాగిస్తున్నారు.
సోనియాగాంధీనగర్లో రూ.60లక్షలతో, వీఎన్రెడ్డినగర్ కాలనీలో రూ.65 లక్షలతో, గాంధీనగర్లో రూ.65 లక్షలతో కల్వర్టుల నిర్మాణం
ఆదర్శనగర్లో రూ.2కోట్లతో, టీచర్స్ కాలనీలో రూ.1.95కోట్లతో, శుభోదయనగర్ కాలనీలో రూ.85 లక్షలతో ఆర్సీసీ బాక్స్ డ్రైన్ పనులు
వెంకట్రెడ్డినగర్లో రూ.80లక్షలతో నాలా అభివృద్ధి, స్లాబ్ పనులు చేపట్టారు.
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో వర్షాకాలానికి ముందే వరద ముంపు నివారణ చర్యలను జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టారు. లింగంపల్లి, తారానగర్, హుడా ట్రేడ్ సెంటర్ ప్రాంతంలోని ప్రధాన నాలాలో అధికారులు జేసీబీ సహాయంతో పూడికతీత పనులు చేపట్టారు. దీంతో వరదనీరు సాఫీగా వెళుతున్నది.
బడంగ్పేట, పహాడీషరీఫ్, సెప్టెంబర్ 8: బాలాపూర్ మండల పరిధిలో గతంలో కురిసిన భారీ వర్షాలకు బడంగ్పేట, మీర్పేట, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకొని జిల్లలగూడలో రూ. 1 కోటి, మీర్పేటలో రూ.23 కోట్లతో ట్రంక్లైన్ పనులు, జల్పల్లి బురాన్ఖాన్ చెరువు తూము నుంచి నీటిని బయటికి పంపేందుకు రూ.50 లక్షలతో అంతర్గత పైప్లైన్ వేయగా పలు కాలనీల్లో వరద బెడద తగ్గింది. మరో రూ.23 కోట్లతో వివిధ ప్రాంతాల్లో వరద నీటి కాలువల నిర్మాణానికి కృషి చేస్తున్నారు.
మియాపూర్, సెప్టెంబర్ 8 : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణినగర్ చిన్నపాటి వర్షానికే అతలాకుతలమయ్యేది. కాలనీకి ఆనుకొని ఉన్న పరికి చెరువుకు నాలా లేకపోవడంతో వరద నీరు ముంచెత్తేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం రూ.42 కోట్లతో కిలోమీటర్ మేర నాలా నిర్మాణ పనులు చేపట్టింది. ఇప్పటికే సింహభాగం పనులు పూర్తి అయ్యాయి. ఫలితంగా ధరణి కాలనీ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లయ్యింది.