ముషీరాబాద్, మే 6: మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పొదుపు రుణాల మంజూరు ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టడానికి జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది 10 కోట్ల మేర రుణాలు ఇవ్వగా, ఈ సంవత్సరం రూ.10.75 కోట్ల మేర మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని యోచిస్తున్నా రు. ఈ ఆర్థిక సంత్సరం ప్రారంభమైనప్పటి నుంచి రూ. 50 లక్షల మేర మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ. 11 కోట్లకు పైగా రుణాలు అందించి మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త మహిళా గ్రూపుల ఏర్పాటు, మహిళలను పొదుపులో భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాలకు యూసీడీ అధికారులు శ్రీకారం చుట్టారు.
ఇటీవల మహిళా గ్రూపుల ఏర్పాటుకు సైతం మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వస్తుండటంతో అధికారులు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న వందలాది మహిళా గ్రూపులు సైతం జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం అందించే రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంభన దిశగా ముందుకు సాగుతున్నారు. యూసీడీ విభాగం ఆధ్వర్యంలో పొదుపు సంఘాలకు రుణాల మంజూరు, సెల్ప్ హెల్ప్, బ్యాంకింగ్ లింకేజీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ పథకాల పట్ల మహిళలకు సరైన అవగాహన కల్పించడంతోపాటు, బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేయిండం, కొత్త గ్రూపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నిరుపేద, మధ్య తరగతి మహిళలకు చేయూతనిస్తూ ప్రగతి పథంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రుణాల మంజూరును సరళతరం చేసింది. ప్రతి పొదపు గ్రూపు నకు లక్ష రూపాయల నుంచి 15 లక్షల వరకు రుణాలు అందించనున్నారు.
మహిళా పొదుపు గ్రూపులు ఏర్పాటు, సభ్యులుగా చేరాలంటే సర్కిల్-15 పరిధిలో నివసిస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న 50 ఏండ్ల లోపు వయసున్న మహిళలు అర్హులు. ముందుగా పది మంది మహిళలు కలిసి పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, యూసీడీ అధికారుల సహాయంతో బ్యాంకు ఖాతా తెరవాలి. మహిళా స్వయం సహాయక సంఘం ఏర్పాటైన తరువాత బ్యాంకు లింకేజీ ద్వారా రుణం పొందడానికి అర్హత సాధించినట్లు అవుతుంది. ఒక గ్రూపులో 10 నుంచి 12 మంది సభ్యులు ఉండవచ్చు. వీరంతా నెలకు ఒక్కొక్కరు వంద లేదా అంతకంటే ఎక్కువ క్రమం తప్పకుండా జమచేస్తుండాలి. ఆరు నెలల తరువాత మొదటగా లక్ష రూపాయల రుణాన్ని అందజేస్తారు. ఆ రుణాన్ని పొదుపు గ్రూపు సభ్యులు చెల్లించగానే రెండవ(లింకేజీని దాటిన ) విడత రూ.3 లక్షలు, అవి సకాలంలో చెల్లిస్తే మూడవ విడతలో నాలుగు, ఐదు లక్షల వరకు , చివర విడతగా రూ.15 లక్షల వరకు పొదుపు సంఘాలకు రుణాలు అందిస్తారు.
మహిళా పొదుపు గ్రూపులకు బ్యాంకులు సకాలంలో రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త గ్రూపుల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రూపులకు సీనియారిటీని బట్టి ఎక్కువ రుణాలు అందించడం జరుగుతుంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రూ.10.75 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– సుధాకర్రావు, యూసీడీ ఇన్చార్జి