శాసనసభ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓటరు తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనున్నది. పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే అధికారులు లెక్కింపు కేంద్రాలకు చేరుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది. నగరంలో తొలి ఫలితం చార్మినార్ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉండగా, చివరి ఫలితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెల్లడికావచ్చు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును భోగారం హోలిమేరి కళాశాలలో నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గం కౌంటింగ్ను ఇబ్రహీంపట్నం పరిధిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో, ఎల్బీనగర్ ఓట్ల లెక్కింపును సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో, శేరిలింగంపల్లి ఓట్లను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో, రాజేంద్రనగర్ ఓట్లను అప్పా జంక్షన్ సమీపంలోని లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో చేపట్టనున్నారు.ఒక్కో నియోజకవర్గంలో తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించి, ఆపై అన్ని రౌండ్ల ఫలితాలను పూర్తి చేస్తారు. తుది ఫలితం వెలువడిన తరువాతనే ఎన్నికల సంఘం విజేతను ప్రకటిస్తుంది. విజేతగా నిలిచిన అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో విజేత ఎవరు? పరాజితులెవరు అన్నది తేలిపోనుంది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. సాయంత్రం వరకు ముగియనుంది. తొలి ఫలితం చార్మినార్ నియోజకవర్గం ఉండగా, చివరి ఫలితం శేరిలింగంపల్లి వెల్లడి కానుంది. కాగా హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు ఒకే చోట లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో నాలుగు చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలయ్యే లెక్కింపు ప్రక్రియలో మొదట ఆర్మీలో పనిచేసిన వారి ఓట్లను , అనంతరం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, మీడియా ప్రతినిధుల పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈ ప్రక్రియ 8.30 గంటల తర్వాత ప్రారంభం అవుతుంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరగనుంది.
పోలింగ్ కేంద్రాల ఆధారంగా ఈవీఎంలను టేబుళ్లపై ఉంచి లెక్కిస్తారు. సూపర్వైజర్ వాటిపై ఉండే రిజల్ట్ మీటను నొక్కి పార్టీల వారీగా నమోదైన ఓట్ల లెక్క నమోదు చేసుకుంటారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఒక్కో నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన కౌంటింగ్ ఆఫీసర్కు, కౌంటింగ్ అసిస్టెంట్లు రిటర్నింగ్ అధికారికి లెక్కింపు వివరాలు ఇస్తారు. అన్ని టేబుళ్ల లెక్కలను కలిపితే…ఓ రౌండ్ ఫలితం వచ్చినట్లు, పరిశీలన తర్వాత సంబంధిత ఆర్వో పరిశీలకులు ఫలితాన్ని వెల్లడిస్తారు. చివరి రౌండ్ ఫలితం పూర్తయ్యాక ఎన్నికల సంఘం అభ్యర్థి గెలుపును ప్రకటించింది. రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.
హైదరాబాద్ జిల్లాలో 45.36 లక్షల ఓటర్లు ఉండగా.. ఓటింగ్లో 21,72,111 మంది మాత్రమే పాల్గొన్నారు. మొత్తంగా 47.88 పోలింగ్ శాతం నమోదు చేసింది. 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా నాంపల్లి నియోజకవర్గంలో 34 మంది, కంటోన్మెంట్లో 10 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
కాగా లెక్కింపు మొదలైన అనంతరం ప్రతీ 15 నుంచి 20 నిమిషాలకు ఒక్కో రౌండ్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల తుది ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. చార్మినార్కు సంబంధించి 202 పోలింగ్ కేంద్రాలున్న తొలి ఫలితం వెల్లడి కానుంది. ఆ తర్వాత సికింద్రాబాద్, కంటోన్మెంట్, గోషామహల్, సనత్నగర్, హైదరాబాద్ జిల్లాలో చివరి ఫలితం జూబ్లీహిల్స్లో ఫలితం వెల్లడి కానుంది. లెక్కింపు క్రమంలో ఏదైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన పక్షంలో నియోజకర్గాల తుది ఫలితాల వెల్లడిలో మార్పులుండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గం శేరిలింగంపల్లిలో 622 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 44 రౌండ్లలో పూర్తవుతుంది. గ్రేటర్లో చివరి ఫలితం శేరిలింగంపల్లిదే కానుంది. ఆ తర్వాత ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు 28 టేబుళ్ల చొప్పున ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయగా ఈ నియోజకవర్గాల్లో 19 నుంచి 23 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో 21 నుంచి 22 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
మేడ్చల్, డిసెంబర్2(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను పూర్తి చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు… జిల్లాలోని భోగారం హోలీమేరీ కళాశాలలో నేడు జరగనున్నాయి. కౌంటింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు(కౌంటింగ్)నకు సంబంధించి 116 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు పార్టీ ఏజెంట్లు రెవెన్యూ సిబ్బంది ఉంటారు.
జిల్లాకు సంబంధించి ఎన్నికల నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టి కౌంటింగ్ సిబ్బందిని ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశపుహాల్లో శనివారం ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజేషన్ చేశారు. 2439 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 508 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో 161 మంది కౌటింగ్ పర్యవేక్షులు 177 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు 170 మంది అబ్జర్వర్లు ఉంటారని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు.
హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు.
అనంతరం అంబర్పేట్ జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మలక్పేట్ కౌంటింగ్ సెంటర్, ప్రొ.జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కౌంటింగ్ సెంటర్, దోమలగూడ ఏవీ కాలేజ్లో ఏర్పాటు చేసిన ముషీరాబాద్ కౌంటింగ్ సెంటర్, నారాయణగూడ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ (జి.ఎఫ్ అండ్ ఓపెన్ గ్రౌండ్) ఏర్పాటు చేసిన అంబర్ పేట్ కౌంటింగ్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఏర్పాటు చేసిన సనత్ నగర్ కౌంటింగ్ సెంటర్ హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యతో కలిసి ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ పరిశీలించారు. కౌంటింగ్ సెంటర్లోకి ఎవరికీ సెల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. ఏజెంట్లు, కౌంటింగ్ నియమించిన సిబ్బంది అందరూ ఉదయం 5 గంటల వరకు కౌంటింగ్ సెంటర్కు రావాలని సూచించారు.
రంగారెడ్డి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 209 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 21,11,204 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. మూడు ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేస్తుండగా.. 400 కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గంలో అదనంగా టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 900 మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపడుతున్నది.
సుల్తాన్బజార్, డిసెంబర్ 2 : కోఠి మహిళా విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన గోషామహల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సందర్శించారు. స్థానిక పోలీసులతో కలిసి ఆయన కేంద్రంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోని ఏర్పాట్లను ఆయన నోడల్ ఆఫీసర్, గోషామహల్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి, సుల్తాన్బజార్ ఏసీపీ చిన్న బాల గంగిరెడ్డి, సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ కొత్తపల్లి ముత్తులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ… గోషామహల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రంలో మూడంచెల భద్రత, పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తుతో పాటు ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.