సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని, అందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి జోన్ షిరిడీ హిల్స్ కాలనీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
మొక్కల నీటి అవసరాలకు ఉద్దేశించిన బోరు మోటారును ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో వన మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా భాగస్వామ్యంతో 25 లక్షల మొక్కలను నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సీజన్ మొత్తం మొక్కలు నాటుతామని చెప్పారు. లక్ష్య సాధనకు నగరంలో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేస్తామన్నారు.
మొక్కలు నాటడంలో నగర పౌరులు క్రియాశీకల భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతి పౌరుడు ‘ఏక్ పేడ్.. మాకే నామ్’ అనే నినాదంతో తమ తల్లి పేరుతో ఒక్కో మొక్క నాటాలన్నారు. మొక్కలను నాటడమే కాదు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మొక్కలు నాటడంవల్ల పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించినవారమవుతామని చెప్పారు. ఆకుపచ్చని హైదరాబాద్ లక్ష్యంగా గ్రేటర్ పరిధిలో వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు.
వార్డుల వారీగా వనమహోత్సవం లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రభుత్వ టార్గెట్ను పూర్తి చేస్తామని అన్నారు. మొక్కలు నాటడంపైనే కాకుండా వాటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో భాగస్వామ్యమైన విద్యార్థులు గో గ్రీన్ అంటూ నినాదాలు చేయగా వారితో కలిసి మేయర్, కమిషనర్ ఫోటోలు దిగి అభినందించారు. కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, యుబీడీ అదనపు కమిషనర్ సుభద్రా దేవి, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.