విద్యుత్ బండి.. విద్యుత్ కారు.. విద్యుత్ ఆటో.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదేమాట. నగరదారులపై కరెంటు వాహనాలు రయ్యుమని తిరుగుతున్నాయి. కాలుష్యం లేకపోవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడం ఈ వాహనాల ప్రత్యేకత. ఒకప్పుడు సంపన్న వర్గాలకే పరిమితమైన ఈ వాహనాలు..ఇప్పుడు గల్లీల్లో కూడా దర్శనమిస్తున్నాయి. ఇందుకు కారణం ఇంధన ధరలు మండిపోతుండడమే. సగటు వాహనవాదారుడికి పెట్రోలు, డీజిల్ వ్యయం భారంగా మారుతోంది. ఫలితంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ) వైపు మళ్లుతున్నారు. విద్యుత్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలతోపాటు జీవితకాల పన్ను, రిజిస్ట్రేషన్ రుసుమును రద్దు చేసింది.
113 రూపాయలు పెట్టి లీటరు పెట్రోల్ పోస్తే ఈ మహానగరంలో ఏ బైకైనా మహా అయితే 40 లేదా 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అంటే ఒక కిలోమీటరు ప్రయాణానికి దాదాపు 3 రూపాయలు వెచ్చించాలన్నమాట. అదే కారైతే ఒక్కో కిలోమీటరుకు 6 రూపాయలు భరించాల్సిందే. ఇలా బండి ట్యాంకులు నింపడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతున్న వర్తమాన పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు సరికొత్త ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే వంద కిలోమీటర్ల వరకు దూసుకెళ్లే బైకులు, ఆటోలొచ్చేశాయి. 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించే కార్లు అందుబాటులో ఉన్నాయి. చమురు ధరలకయ్యే ఖర్చులో పదో వంతు కన్నా తక్కువ వెచ్చించే సదుపాయాన్ని పలు వాహన సంస్థలు చేరువ చేస్తున్నాయి. ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నింటినీ ప్రదర్శిస్తూ మాదాపూర్ హైటెక్స్లో శుక్రవారం రెండు రోజుల షో ప్రారంభమైంది.
నేను దమ్మాయిగూడలో ఉంటాను. ‘ఈటో’ సంస్థ నిర్వాహకులు నాకు ప్యాసింజర్ ఆటో ఇచ్చారు. ప్రతి రోజు కోఠి -కాచిగూడ- సికింద్రాబాద్ దారిలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఆటో నడుపుతాను. ఒకప్పుడు 100 కిలోమీటర్లు నడపాలంటే 225 రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో వల్ల 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 10 రూపాయల ఖర్చులో నడపగలుగుతున్నాను. ప్రతి రోజు 700 నుంచి వెయ్యి వరకు సంపాదిస్తున్నాను. ఆటో కూడా సైలెంట్గా ఎలాంటి శబ్ధం లేకుండా ముందుకు సాగుతుండడంతో కొంతమంది ప్రయాణికులు ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటున్నారు. డౌన్ పేమెంట్ లేకుండానే ఆటో ఇచ్చి ఉపాధి కల్పించిన ఈటో సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు. – జి.వీణ, దమ్మాయిగూడ
వాతావరణ కాలుష్య నివారణలో విద్యుత్ వాహనాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తుండడంతో ఈ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండడంతో వాహనదారులు ఇప్పుడిప్పుడే వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలు, సరుకు వాహనాలు, ఆటోలు, కార్లను ఆయా కంపెనీలు పోటీపడి తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత చేరువచేసేందుకు ఈవీ ట్రేడ్ సంస్థ ప్రతినిధులు ఎలక్ట్రిక్ ట్రేడ్ ఎక్స్పో పేరుతో శుక్రవారం మాదాపూర్లోని హైటెక్స్లో రెండురోజుల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ గ్రిడ్, చార్జింగ్ స్టేషన్లు, విభిన్న రకాల ద్విచక్ర వాహనాలను ప్రదర్శించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ, తెలంగాణ స్టేట్ రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ మనోజ్లతో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రదర్శనను ప్రారంభించారు.
ఈటో సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను నగరంలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఈ-కామర్స్, ప్యాసింజర్ ఆటోలను విక్రయిస్తున్నది. ఈ సంస్థ పురుషులకు తక్కువ రాయితీతో, మహిళలకు ఉచితంగా ఆటోలను అందజేస్తోంది. ఈ ఆటోలను రెండు వర్షన్లలో తెచ్చారు. దీని వీల్ 13 ఇంచులతో ఉంటుంది. బ్యాక్ కెమెరా, సీట్ బెల్ట్, డిస్క్, డ్రమ్ బ్రేక్లతోపాటు ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. 4 గంటలపాటు చార్జింగ్ పెడితే 100 నుంచి 120 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. ఈ-కామర్స్లో ఇప్పటివరకు 400 ఆటోలు నడస్తుండగా 100 ప్యాసింజర్ వాహనాలను నగరంలో నడుపుతున్నారు. ఈ ఆటోలను మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఉత్పత్తి చేస్తున్నామని, ధర రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు ఉంటుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ వైఎస్ఆర్ తెలిపారు. ఆటోలు నడుపుతున్న వారిలో 600 మంది ఉండగా, 10 శాతం మహిళలు ఉన్నారన్నారు.
ఈటో సంస్థ ఈవీ ఆటోలతోపాటు చార్జర్లను తయారు చేస్తున్నది. తండర్ బాక్స్ పేరిట చార్జర్ ఐపి 67 ప్రొటెక్ట్తో ఈ స్మార్ట్ చార్జర్ను విక్రయిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్టేషన్లను అన్ని ప్రాంతాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో సంస్థ కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లు, టీ స్టాళ్ల నిర్వాహకులకు చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. తొలి వంద మందికి ఉచితంగా చార్జర్లను ఇవ్వనుంది. చార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే యూనిట్కి రూ.6 వసూలు చేయనున్నారు. ఈ తండర్ బాక్స్ చార్జర్ ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. వర్షం పడినా, కరెంట్లో హెచ్చుతగ్గులు వచ్చినా చార్జింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రావు. 4 గంటలపాటు చార్జ్ చేస్తే కేవలం 3.3 యూనిట్ల ఖర్చవుతుంది. ఈ చార్జర్ సింగిల్, 3 ఫేస్తో పనిచేస్తుంది.
ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన టాటా కంపెనీ ఇప్పటికే పలు విద్యుత్ కార్లను విక్రయిస్తోంది. వీటి వినియోగాన్ని మరింత పెంచేందుకు రానున్న రోజుల్లో మరిన్ని ఈవీ కార్లను తెస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. టాటాలో ఇప్పటివరకు మూడు ఎలక్ట్రిక్ కార్లు రాగా, ఇందులో టాటా నెక్సాన్-ఎస్యువి అధికంగా అమ్ముడుబోతున్నది. ఈ కారు 127 బీహెచ్పీ పవర్, 245 ఎన్ఎం టార్క్ స్పీడ్ను జనరేట్ చేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 260 కి.మీ. వరకు ప్రయాణించొచ్చు. కారు ఎక్స్ షోరూం ధర రూ.13 లక్షల నుంచి రూ.17 లక్షలు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని విశాఖ ఇండస్ట్రీస్ ఆటామ్ మొబైల్ పేరిట ఆటోమొబైల్ వెహికల్, చార్జింగ్ స్టేషన్, సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్లను తయారు చేస్తున్నది. ఆటామ్ చార్జర్ మొత్తం 10 కిలోవాట్ ఉండగా, ఒక్కోటి 3.3 కిలోవాట్ చొప్పున మూడు చార్జర్లు ఉంటాయి. ఒకే సమయంలో మూడు వాహనాలను చార్జింగ్ చేయొచ్చు. కార్లకు, ద్విచక్ర వాహనాలకు చార్జ్ చేయడమే కాకుండా ఇది పూర్తిగా స్లో చార్జర్. టూ వీలర్కు 4 గంటలు, కారుకు 6 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. ఈ చార్జర్ ధర రూ.70 వేలు. కిరాణ, షాపింగ్మాల్స్, హోటళ్ల వద్ద చార్జింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఒకసారి చార్జ్ చేస్తే 1.5 యూనిట్స్ తీసుకోవడంతో కేవలం రూ.10 లోపే ఖర్చవుతుంది. ఆటామ్ బైక్ ధర రూ.57,500 .
ఆటామ్ చార్జర్లతోపాటు సోలార్తో నడిచే చార్జర్లను విక్రయిస్తున్నది. సోలార్ 1.3 కిలోవాట్తో 4 ప్యానెళ్లను కలిగి ఉంటుంది. ఇది 325 వాట్స్తో చార్జ్ అందిస్తుంది. దీని వ్యయం రూ.లక్ష. ఈ సోలార్ ఒక రోజులో 5 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తుంది. నెలకు 120 నుంచి 130 వరకు విద్యుత్ను జనరేట్ చేస్తుంది. సోలార్కు గ్రిడ్ ఉండటంతో వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. దీనికి కంపెనీ 25 ఏండ్ల వరకు వారంటీ ఇస్తోంది. 12 ప్యానెళ్లతో 4 కిలోవాట్ల సోలార్ కూడా ఉంది. దీని ధర రూ.7.4 లక్షలు. దీని ఏర్పాటుకు 800 చదరపు అడుగుల స్థలం అవసరం.
టాటా కంపెనీ మూడు రకాల ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నది. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీ. నెక్సాన్ అత్యుత్తమ సేల్స్ను సొంతం చేసుకుంది. ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 260 కి.మీ. ప్రయాణించొచ్చు. ఇందులో ఆటో, స్పోర్ట్స్, ఈకో మోడ్ రకాలున్నాయి. హైవేలపై వెళ్లినప్పుడు ఈ మోడ్లను తగినట్లుగా మార్చుకుంటే సరిపోతుంది. కారు కొనుగోలు చేసిన యజమాని మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చార్జింగ్ స్టేషన్ల వివరాలు, కారు వేగం, కారు దొంగిలిస్తే ఆగేలా చేయొచ్చు. -షేక్.మతిన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మలక్పేట
మా వద్ద ఆటోమొబైల్ వాహనాలు, ఆటామ్ చార్జర్లు, సోలార్తో చార్జ్ చేసే ప్యానళ్లు తయారవుతాయి. అందరికీ అందుబాటులో ఉండేలా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. కేవలం ఖాళీ స్థలం ఇస్తే చాలు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతినెలా డబ్బులు అందజేస్తాం.
-సురేష్, ఆటామ్ పవర్ నిర్వాహకుడు