జవహర్నగర్, డిసెంబర్ 6: నేడు బాలికలు చదువుకుంటేనే రేపు వారి ఇల్లుతో పాటు ఊరు, దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డ చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బాలికల కోసం కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యేక గురుకులాలు ప్రారంభించి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా క్రీడల్లో, కరాటేలో తర్ఫీదునిస్తూ ఆత్మరక్షణకు గట్టి పునాదులు వేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే పేదవారు చదువుకు దూరం అయ్యేవారి కోసం తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన విదేశీ విద్య సహాయంతో ప్రతి నిరుపేద విద్యార్థి విదేశాలకు వెళ్లి పెద్ద చదువుకొని గొప్పవారు అవుతున్నారు.
బాలికల్లో మరింత విశ్వాసం
బాలిక సాధికారత క్లబ్ల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికల్లో మరింత విశ్వాసం పెరిగింది. ఈ కమిటీల ద్వారా ఎదుగుదలతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, జీవన నైపుణ్యంపై ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో డాక్టర్లతో బాలికల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. బాల్య వివాహాలు, హింస, లైంగికదాడులు అడ్డుకోవడంపై అవగాహన సదస్సుల నిర్వహణతో విద్యార్థుల్లో మనోవికాసం పెరిగింది.
క్లబ్ ఏర్పాటు..కమిటీ ఎన్నిక ఇలా..
బాలిక సాధికారత క్లబ్లో ప్రిన్సిపాల్తో పాటు, ఉపాధ్యాయురాలు, ప్రతి తరగతి నుంచి ఇద్దరు చురుకైన విద్యార్థినులు, షీటీమ్ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. విద్య, పోలీస్శాఖ సమన్వయంతో ఇవి పనిస్తున్నాయి. తమపై జరిగే దాడులపై ఫిర్యాదు చేసేందుకు పాఠశాలలో 100, 1088, 181 వంటి టోల్ఫ్రీ నంబర్లను పాఠశాలలో ప్రదర్శించారు.
సమాజం పట్ల అవగాహన కల్పిస్తున్నారు..
మా పాఠశాలలో బాలికల సాధికారత కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో మెంబర్గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాలికలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై అవగాహన కల్పిస్తున్నా రు. బాల్యంలో అప్రమత్తంగా ఉండే విధానంపై అవగాహన వస్తుంది. మా ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవడం, పరిశుభ్రంగా ఉండడం తెలుసుకుంటున్నాం.
-జి. చంద్రకళ, 9వ తరగతి, జిల్లా ఉన్నత పాఠశాల జవహర్నగర్
బాలికల్లో మనోధైర్యం కల్పించడమే క్లబ్ లక్ష్యం
పాఠశాలల్లో చదివే విద్యార్థినుల్లో మనోధైర్యం కల్పించడానికే ప్రభుత్వం సాధికారత క్లబ్లు ఏర్పాటు చేసింది. తరగతి నుంచి ఇద్దరు చురుకైన బాలికలను సభ్యులుగా చేయడంతోపాటు ఉపాధ్యాయురాలు కన్వీనర్గా, పాఠశాల హెచ్ఎం చైర్మన్గా ఉన్నారు. ఈ కమిటీ ద్వారా సమాజంలో జరుగుతున్న విషయాలపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం.
– ఎస్. గంగా లక్ష్మీదేవి, సాధికారత కమిటీ కన్వీనర్, ఎస్ఏ మ్యాథ్స్, జవహర్నగర్ ఉన్నత పాఠశాల
ఆడబిడ్డలను గౌరవించాలి
సమాజంలో ఆడబిడ్డలను గౌరవించాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పాఠశాలల్లో బాలిక సాధికారత కమిటీలు వేశాం. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీలు ఎంతో దోహదపడుతున్నాయి. బాలికలకు హక్కులపై అవగాహన కల్పించడంతో వారిలో ప్రశ్నించేతత్వం పెరుగుతుంది.
– కె. శంకరయ్య, జీహెచ్ఎం, సాధికారత కమిటీ చైర్మన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జవహర్నగర్