సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): కుటుంబ సభ్యులు మొత్తం కలిసి కొన్నేండ్లుగా గంజాయి దందా చేస్తున్నారు. ఈ గ్యాంగ్ను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీ న్యాబ్) అరెస్టు చేసింది. డ్రగ్స్ దందాతో సంపాదించిన రూ. 4 కోట్ల విలువైన ఆస్తులు, నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ వివరాలను బుధవారం బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీ న్యాబ్ ఎస్పీ చక్రవర్తి గుమ్మి వివరించారు. నానక్రామ్గూడ, లోధ బస్తీకి చెందిన కలాపతి గౌతం సింగ్, అతడి తల్లి కలాపతి నీతూబాయి, అదే ప్రాంతానికి చెందిన మధుబాయి, ఒక బాలుడు, మరో ఆరుగురు కలిసి కొన్నేండ్లుగా గంజాయి దందా చేస్తున్నారు.
వీరంతా ఒకే కుటుంబ సభ్యులు. నీతూబాయిపై గతంలో ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు కాగా.. ఆమెపై పీడీ యాక్టు కూడా ప్రయోగించారు. ఆమె కొడుకుపై కూడా కేసులు ఉన్నాయి. నీతూబాయి కుటుంబ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ ఈ డ్రగ్స్ దందా చేస్తున్నారు. ధూల్పేటలో కిలో రూ.8 వేలు చొప్పున కొనుగోలు చేసి.. 5 గ్రాముల బరువుతో ప్యాకెట్లు తయారు చేసి, ఒక్కొక్కటి రూ. 250 లకు విక్రయిస్తున్నారు. ఇలా.. ఒక కేజీపై రూ. 50వేలకు పైగా ఈ ముఠా సంపాదిస్తున్నది. భారీ లాభాలు వస్తుండటంతో వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతూ.. ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం గౌతమ్ సింగ్, బాలుడితో కలిసి గంజాయితో వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో.. గోల్కొండ పోలీసులతో కలిసి నార్కొటిక్ బ్యూరో సిబ్బంది పట్టుకున్నారు. వీరిద్దరిని విచారించగా నీతూబాయి, మధుబాయి, ఇతరుల గూర్చి వివరించారు.
దీంతో ఈ నలుగురిని అరెస్టు చేసి, పరారీలో ఉన్న ఇతరుల కోసం గాలిస్తున్నారు. కాగా, నీతూబాయి లంగర్హౌస్, గచ్చిబౌలి ప్రాంతాల్లో మూడంతస్తుల భవనాలు, ఖరీదైర కార్లు కొనుగోలు చేసింది. గంజాయి అమ్మకంతో వచ్చిన రూ. 40.30 లక్షలు, 16 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.53 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నానక్రామ్గూడలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వీరి దందా అక్కడే ఎక్కువగా నడుస్తున్నదని పోలీసులు గుర్తించారు. ప్రతి రోజు కనీసం రూ. 30 వేల వరకు సంపాదిస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పిల్లల వ్యవహారశైలిపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, యువత డ్రగ్స్కు అలవాటు పడుతున్నదని, ఫ్యాషన్ పేరుతో ఆరంభించి వాటికి బానిసలుగా మారే పరిస్థితికి వస్తున్నారని టీన్యాబ్ ఎస్పీ చక్రవర్తి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్పై ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే 87126 71111కు ఇవ్వాలని సూచించారు.
ఎస్ఓటీకి చిక్కిన మరో ముఠా రూ. 35 లక్షల సొత్తు స్వాధీనం
సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఓడిశా నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు కలిసి అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ.35 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వివరాలను బుధవారం రాచకొండ సీపీ డీఎస్. చౌహాన్, మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒడిశా రాష్ర్టానికి చెందిన భువన్ సాబేర్, వరుణ్ కుమార్ పట్నాయక్ డిగ్రీ పూర్తిచేసి ఏపీలోని వైజాగ్ ప్రాంతంలో హార్డ్వేర్ దుకాణంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వైజాగ్కు చెందిన సురేశ్ ఈ ఇద్దరిని కలిశాడు. ఒడిశా సరిహద్దులో గంజాయి విక్రయించే వారితో పరిచయం ఉన్నదని, అక్కడ గంజాయి కొని, మహారాష్ట్రలో చోటు అనే వ్యక్తికి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒడిశాలో 100 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. కారులో భువన్, వరుణ్ మహారాష్ట్రకు బయలుదేరారు. గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం రావడంతో బుధవారం ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాములు, కీసర పోలీసులతో కలిసి ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద నిఘాపెట్టి పట్టుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి, కారు, అందులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.