సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా ఉన్న డ్రగ్ నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదిస్తున్నారు. తాజాగా ఇద్దరిని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి మూడు గ్రాముల కొకైన్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గోవా డ్రగ్ డాన్ నెట్వర్క్పై దర్యాప్తు చేస్తుండగా బాలీవుడ్, అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్స్ నిర్వహించే డీజే ఆర్గనైజర్ పట్టుబడ్డాడు. అతడి భార్య బాలీవుడ్ హీరోయిన్ కావడం వ్యాపారానికి బాగా కలిసొచ్చింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) దర్యాప్తు చేస్తున్న కేసులు కీలక మలుపు తిరుగుతున్నాయి. హైదరాబాద్, గోవా, ముంబై, బెంగళూర్తో సంబంధాలు ఉన్న కీలక నెట్వర్క్పై హెచ్న్యూ పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు.
అంతర్జాతీయ స్థాయిలో డీజేలు..
హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి కథనం ప్రకారం.. గోవాలోని డ్రగ్ డాన్లలో ఒకడిగా పేరొందిన ఎడ్విన్ను ఇటీవలే హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా పలువురి పేర్లు వెల్లడించాడు. అతడి నెట్వర్క్ గురించి పూర్తిగా తెలుసుకున్న హెచ్న్యూ ఒక్కొక్కరిపై నిఘా పెట్టి అరెస్టు చేస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కొండాపూర్కు చెందిన మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరన్ మోహిత్పై దృష్టి పెట్టారు. కొన్నాళ్లు పబ్బుల్లో పనిచేసిన మోహిత్ డీజే ఈవెంట్లు చేశాడు. కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో డీజేలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నాడు. అతడి ఆధ్వర్యంలో హైదరాబాద్, గోవా, బెంగళూరు, ముంబైలో పబ్బులు, ప్రైవేట్ కార్యక్రమాల్లో డీజేలు నడుస్తుంటాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ సంపాదించాడు.
ఈవెంట్స్లో బడా బాబులు..
ఏడాదిన్నర కిందట ముంబైలో ఒక క్రూజ్లో జరిగిన రేవ్ పార్టీకి బడాబాబుల పిల్లలు హాజరయ్యారు. అందులో షారూఖ్ఖాన్ కొడుకు కూడా ఉన్నాడు. అందులో డ్రగ్స్ వాడుతున్నారనే అనుమానంతో నేషనల్ నార్కోటిక్ బ్యూరో దాడి చేసింది. ఆ పార్టీలో పాల్గొన్న కొందరి వద్ద నుంచి డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో షారూఖ్ఖాన్ కొడుకును కూడా అరెస్ట్ చేశారు.
గోవా కేంద్రంగా దందా..
ముంబై ఈవెంట్లో మోహిత్ డీజేలను ఏర్పాటు చేశాడు. అతడి భార్య నేహాదేశ్పాండే బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసింది. మోహిత్ ప్రత్యేకంగా ఈవెంట్లు ఏర్పాటు చేస్తూ డ్రగ్స్ విక్రయించాడు. అతడి వద్ద ఉన్న దాదాపు 50 మంది వినియోగదారులు ప్రస్తుతం డ్రగ్స్ విక్రేతలుగా మారారు. గోవా కేంద్రంగా దందా నిర్వహిస్తూ.. పలు ప్రాంతాలకు కొకైన్ సరఫరా చేశాడు. ముంబైలో డిసెంబర్ 31 సందర్భంగా భారీగా ఈవెంట్లు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు హైదరాబాద్కు వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్లోని ఎఫ్హౌస్ వద్ద హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్దనుంచి గ్రాము కొకైన్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. .
కాంట్రాక్టర్ అరెస్ట్
ఎడ్విన్తో సంబంధాలు ఉన్న బంజారాహిల్స్కు చెందిన మాన్యం కృష్ణ కిశోర్రెడ్డిని హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ పూర్తి చేసిన కిశోర్, ప్రస్తుతం కేఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రోడ్డు కాంట్రాక్టర్గా వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. తరచూ పబ్లు, గెస్ట్హౌస్లలో ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నాడు. గోవాకు వెళ్లి ఎడ్విన్ను కలుస్తూ డ్రగ్స్ తీసుకున్నాడు. ఎడ్విన్ ద్వారా బెంగళూర్లో ఉన్న డ్రగ్స్ మాఫియాతో పరిచయాలు పెంచుకున్నాడు. ట్రావెల్ రంగంలో ఉన్న పలువురి సహాయంతో కిశోర్ హైదరాబాద్కు డ్రగ్స్ తెప్పించుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్న్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం రాంగోపాల్పేట్ పోలీసులతో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసింది. అతడి నుంచి రెండు గ్రాముల కొకైన్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.