సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను కట్టడి చేసేందుకు డ్రోన్ కెమెరాలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తూ అసాంఘిక శక్తులకు చెక్ పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో వాహనాల గస్తీ, విజిబుల్ పోలీసింగ్ తగ్గుతుందనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తుంది. పాత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటూ సూచిస్తున్నారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలు వెళ్లని చోటకు, పెట్రోలింగ్ చేయలేని ప్రాంతంపై ఈ డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘాను పెంచుతున్నారు. ఈ డ్రోన్ కెమెరాలతో ఇప్పటి వరకు 20కిపైగా పిటీ కేసులు పోలీసుల నమోదు చేశారు. డ్రోన్లతో వీడియోలు, ఫొటోలు తీస్తూ అసాంఘిక శక్తులపై పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. గతంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రవేశ పెట్టిన సైకిల్ పెట్రోలింగ్ను అటకెక్కించారా? అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.