ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నదని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలను సమకూర్చిందని చెప్పారు. విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేందుకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని సైతం అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తార్నాక డివిజన్లోని లాలాపేట గడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని, అక్కడి స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలతో విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతాప్రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్రావుగౌడ్, సునీల్ ముదిరాజ్, మల్లికార్జున్ అందేకర్, మల్లికార్జున్గౌడ్, దీపు, గాయత్రి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.