బేగంపేట్, జనవరి 27: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని దక్కన్ భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. గురువారం సిబ్బంది కొంత వరకు భవనాన్ని కూల్చి వేశారు. భవనం ఎత్తు ఎక్కువగా ఉండటంతో కూల్చివేతకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. ఈ భవనం పూర్తిగా కూల్చి వేయడానికి మరో నాలుగు రోజులు పడుతుందని, మొత్తం శిథిలాలను తరలించేందుకు మరో పది రోజులు పడుతుందన్నారు. భవనం పూర్తిగా కూల్చివేసే వరకు బస్తీ వాసులు యాథావిధిగానే మున్నూరు కాపు సంఘం భవనంలోనే వసతి పొందనున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని కూల్చివేత పనులు మొదలుపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.