సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తాము నగరం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేస్తున్న ట్రిప్స్తో నష్టపోతున్నామని, తమ ఫేర్ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని డ్రైవర్లు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి, సిటీ నుంచి ఎయిర్పోర్ట్కు ఓలా, ర్యాపిడో, ఉబర్, డ్రైవర్ కం ఓనర్ వాహనాల డ్రైవర్లు ఫేర్ చార్జీలపై సర్వే చేశారు. తమకు గిట్టుబాటయ్యే ధరలను పేర్కొంటూ.. శనివారం పోస్టర్ను రూపొందించారు. ఈ పోస్టర్ను మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. సిటీ నుంచి ఎయిర్ పోర్ట్, ఫిక్స్ రేట్ కార్డు విధానాన్ని జీఎంఆర్, అగ్రిగేటర్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీఆర్టీయూ మాక్స్ టాక్సీ, క్యాబ్ డ్రైవర్ల కలిసి చేసిన సర్వే రేట్ కార్డును అమల్లోకి తేవాలని డ్రైవర్లు కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్ లైన్ 2025ను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సవరించి, టాక్సీ, ఆటో, గిగ్, ప్లాట్ ఫామ్ వరర్లకు బేస్ ఫేర్ పర్ కిలోమీటర్, పర్ మినిట్ ఆధారంగా యూనిఫామ్ ఫేర్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ ఉపాధ్యక్షులు, టాక్సీ, గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వరర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అత్తినమొని నాగేశ్ కుమార్ మాట్లాడుతూ, సిటీ నుంచి ఎయిర్ పోర్ట్కు ఒక ట్రిప్నకు 450- 600 బిల్లు వచ్చినప్పటికీ, అందులో సుమారు 300 వరకు ఇంధన ఖర్చు అవుతోందన్నారు. ఎయిర్ పోర్ట్లో బుకింగ్ కోసం 4-5 గంటలు వేచి ఉన్న తర్వాత, ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి 500- 700 రూపాయల బుకింగ్ వచ్చినా, సుమారు 350 జీఎంఆర్ పారింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఎయిర్ పోర్ట్ డిపార్చర్ వద్ద ప్రయాణికులను డ్రాప్ చేసే సమయంలో 8 నుంచి 10 నిమిషాలు దాటితే రూ. 250, పది నుంచి 15 నిమిషాలు దాటితే రూ. 500 వరకు పెనాల్టీలు విధించడం వల్ల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. డ్రాప్నకు కనీసం 10- 15 నిమిషాల ఉచిత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.