సికింద్రాబాద్, డిసెంబర్ 24 : కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకొని సరఫరా చేస్తున్న డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్తో కలిసి నార్త్జోన్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ చందనాదీప్తి, అదనపు డీసీపీ యోగేశ్, నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ డీసీపీ చక్రపాణి వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన ఖాదర్ మోహిద్దీన్ (36)తో పాటు ఇబ్రహీం షా(32) సులభంగా డబ్బులు సంపాదించేందుకు మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండేండ్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు చెందిన డ్రగ్స్ ఏజెంట్లను పరిచయం చేసుకున్నారు. చెన్నైలో డ్రగ్స్ కొనుగోలు చేసి విమానాల ద్వారా హైదరాబాద్కు దిగుమతి చేసుకుంటారు. కస్టమ్స్ అధికారుల కళ్లుకప్పి ఇతర దేశాలకు సైతం మత్తు పదార్థాలను సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో నగరంలోని వివిధ కొరియర్ సర్వీసర్లను పరిచయం చేసుకున్నారు.
వీరి సహకారంతో నేరుగా ఎయిర్పోర్టు ద్వారా మాదక ద్రవ్యాలను ఇతర దేశాలకు సరఫరా చేసేందుకు పక్కాప్లాన్ వేశారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి గాజులు, దుస్తులు వంటి వస్తువుల పేరుతో పార్సళ్లను బుకింగ్ చేస్తారు. ఈ క్రమంలో ఈనెల 23న బేగంపేట్ ఎయిర్పోర్టులో 3.01 కిలోల మాదక ద్రవ్యాల పౌడర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు నార్త్ జోన్ అదనపు డీసీపీ యోగేశ్కుమార్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు వెళ్లి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకు వెళ్లేందుకు వచ్చిన ఖాదర్ మోహిద్దీన్, ఇబ్రహీంషాలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నగరంలోని ఫిడ్ ఎక్స్, మథర్ ఇండియా కొరియర్ సర్వీస్, వరల్డ్ ఫస్ట్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్, అవక్యా డాట్ కాం కొరియర్ సర్వీస్, అథోనెటిక్ షిప్, పోస్ట్ బాక్సు ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీస్, ఎంఎస్ఆర్ కొరియర్ సర్వీస్ల పేర్లు బయటకు వచ్చాయి.
దీంతో కొరియర్స్ బాయ్లు ముజీబ్ (32) (ఫిడ్ ఎక్స్), ఇ.రవి కుమార్ (44) (మథర్ ఇండియా), వివేకానంద రెడ్డి(వరల్డ్ ఫస్ట్ డోమెస్టిక్ ఇంటర్నేషనల్ కొరియర్), జె.శ్రీనివాస్ రావు (కూకట్పల్లి) (ఆవక్య డాట్ కాం కొరియర్), వరప్రసాద్ ( బోడుప్పల్) (అథోటిక్ షిప్ కొరియర్), మహేశ్ (గచ్చిబౌలి) (పోస్ట్ బాక్స్ ఎక్స్ప్రెస్ కొరియర్), నరేందర్ రెడ్డి ( చెంగిచెర్ల) (ఎంఎల్ఆర్ కొరియర్) ప్రస్తుతం పరారీలో ఉన్నాడని డీసీపీ చెప్పారు. వీరి నుంచి మూడు కోట్ల విలువైన 3.01 కిలోల ఎపిడ్రన్ డ్రగ్స్, 23 సిమ్ కార్డులు, 12 నకిలీ ఆధార్ కార్డులు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.