కొండాపూర్ : వినికిడి సమస్యతో బాధపడుతున్న విదేశీ మహిళకు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీతో హైటెక్సిటీలోని మెడికవర్ దవాఖాన వైద్యులు నయం చేశారు. చికిత్సకు సంబంధించిన వివరాలను దవాఖాన ఈఎన్టీ వైద్యులు సంపూర్ణ గోష్ వెల్లడించారు. యెమన్ దేశానికి చెందిన 45 సంవత్సరాల మహిళ దశాబ్ద కాలంగా వినికిడి సమస్యతో బాధపడుతుంది. రెండు చెవులకు వినికిడి పరికరాలను వినియోగిస్తున్నప్పటికీ కొన్ని సంవత్సరాలుగా సమస్య తీవ్రమవుతుండడంతో చికిత్స నిమిత్తం వివిధ దవాఖానలకు వెళ్ళింది.
చికిత్సలో భాగంగా మెడికవర్ దవాఖానకు విచ్చేయగా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సర్జరీ పూర్తైన నెల రోజుల తర్వాత వినికిడి సమస్య సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిపారు. కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అన్ని వయస్సుల వారు చేసుకోవచ్చని, ముఖ్యంగా వినికిడి సమస్యలున్న వృద్ధులకు గొప్పగా పని చేస్తుందన్నారు. మన దేశంలో అధిక శాతం ఈ సర్జరీలను చిన్న పిల్లలకు మాత్రమే చేస్తున్నారని, అతి తక్కువ మంది వైద్యులు ఈ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.