సిటీబ్యూరో, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం ముగిసినందుకు ట్రై కమిషనరేట్ల పోలీస్ బాసులు సంతోషం వ్యక్తం చేశారు. నగర ప్రజలు, మండపాల నిర్వాహకులు అందించిన సహకారం, 36 శాఖల ప్రభుత్వ అధికారుల సమన్వయంతో నిమజ్జన ఘట్టం విజయవంతమైందన్నారు. ప్రణాళికాబద్ధంగా 40 రోజుల నుంచి పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని చెప్పారు. హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నగరవాసులు, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ.. ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మొత్తం 27 వేలకు పైగా విగ్రహాలు హూస్సేన్ సాగర్లో నిమజ్జనం అయినట్లు వెల్లడించారు. కాగా, హోం మంత్రి మహమూద్ అలీ సైతం పోలీస్ సిబ్బందిని ప్రశంసిస్తూ.. ట్వీట్ చేశారు.