సుల్తాన్బజార్, జూలై 24: కొవిడ్ విపత్కర సమయంలో ఎంతో మంది యువత ఉపాధిని కోల్పోవడం బాధాకరమని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల స్టాళ్ళను పర్యవేక్షించి కంపెనీల ప్రతినిధులను ఉద్యోగాల కల్పన గురించి తెలుసుకున్నారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా గత యేడాదిన్నరగా ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారని అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగులకు ఉపాధిని కల్పించేందుకు గాను జాబ్మేళాను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జాబ్ మేళాలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన 24 కంపెనీల ప్రతినిధులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన రెండేళ్లలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 33 శాతం మహిళలకు ఉపాధిని కల్పించినట్టు తెలిపారు. జాబ్ మేళాళో నాలుగు వేల మంది మహిళలు, పురుషులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి నిరుద్యోగులు పెద్దెత్తున పాల్గొన్నారు.