సైదాబాద్, అక్టోబర్ 7: కరోనా విపత్కర పరిస్థితుల మూలంగా టెక్నాలజీ వినియోగం చాల పెరిగిందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. గురువారం రాత్రి చంపాపేటలోని ఓ గార్డెన్లో ఏకలవ్య ఫౌండేషన్, అక్షయ విద్య ఆధ్వర్యంలో మురికివాడల్లో మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల మూలంగా సెల్ఫోన్ల ద్వారా ఆన్లైన్లో విద్యను అభ్యసించే పరిస్థితులు వచ్చాయని, అందుకోసం ప్రతి ఒక్కరూ టెక్నాలజీ వినియోగించుకోవటం జరుగుతుందన్నారు.
అందుకు ప్రధాన కారణంగా కరోనా మూలంగా ఆన్లైన్ ద్వారానే విద్యాబోధన జరుగుతుందన్నారు. మురికివాడల్లో నివసించే పేద విద్యార్థులకు ఆన్లైన్ విద్య కోసం వియాట్రీస్ (మైలన్) సంస్థ ఆర్ధిక సహకారం అందిచటం పట్ల ఆయన సంస్థ ప్రతినిధులను అభినందించారు. సికింద్రాబాద్ మిచెల్ డోమెనిక (హెడ్ ఆఫ్ ఇండియా) 120 సెల్ ఫోన్ల అందించారు. అదే విధంగా సికింద్రాబాద్ లోడ్జ్ సంస్థ సహకారంతో గురుకుల పాఠశాలలకు ఎంపికైన 140 మంది విద్యార్థులకు ట్రస్క్ పెట్టే, బకెట్ వంటి వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ రెడ్డి, వియాట్రీస్ (మైలన్) సంస్థ అరుందతి, ఏకలవ్య ఫౌండేషన్ ఫౌండర్ వేణుగోపాల్, అక్షయ విద్య కార్యనిర్వాహకులు ప్రసాద్, మురళీధర్, ఏసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.