సుల్తాన్బజార్, సెప్టెంబర్ 4. చిన్నారులు, మహిళలకు భద్రతతో పాటు రక్షణకు పోలీస్ శాఖ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని షీటీమ్స్ భరోసా కేంద్రం 5వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్, టీ-ఎస్ఐజీ, మిస్ ఇండియాల సంయుక్తాధ్వర్యంలో ‘టు గెదర్ వి కెన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్, ఫెమినా మిస్ ఇండియా మానస వారణాసి, మహిళా,శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, నగర అదనపు సీపీ శిఖా గోయెల్, జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, షీటీమ్స్, భరోసా అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్రలతో కలిసి సీడీని ఆవిష్కరించారు. షీ టీమ్స్ పోలీసులు మహిళలకు నిరంతరం రక్షణ కల్పించి.. వారిలో భరోసా కల్పిస్తున్నందుకు సీపీ అభినందించారు.
మానస వారణాసి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పిల్లలపై లైంగిక వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల స్థాయి నుంచే చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాలను నేర్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా,శిశు,సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ శిశు సంరక్షణ కోసం 24 గంటల పాటు ప్రత్యేక కమిటీ బృందం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.