హైదరాబాద్ : ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి అదేవిధంగా హ్యుమన్ ట్రాఫికింగ్ నుండి రక్షించబడిన వ్యక్తుల కోసం ప్రజ్వల సహకారంతో మెడికోవర్ హాస్పిటల్స్ శుక్రవారం ఉచిత కొవిడ్ టీకా డ్రైవ్ను నిర్వహించింది. సామాజిక సేవలో భాగంగా ఎల్జీబీటీకి చెందిన 200 మంది అదేవిధంగా ప్రజ్వల చేత రక్షించబడిన వ్యక్తులకు మెడికోవర్ హాస్పిటల్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఇలాంటి డ్రైవ్లను నిర్వహించడానికి ప్రజలను ప్రేరేపించడం కూడా దీని లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా అన్న పిలుపులో భాగంగా సమాజంలో ఎక్కువగా విస్మరించే వర్గాల వారికి తాము టీకా అందించాలని భావించినట్లు మెడికోవర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ తెలిపారు.
ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వివక్ష, పక్షపాతం కారణంగా సమాజంలో అట్టడుగున ఉందన్నారు. ఇది వారి ఆరోగ్య వ్యవస్థను సవాల్ చేస్తుందన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాపించిన తప్పుడు సమాచారంతో ట్రాన్స్జెండర్స్ అంటే సమాజంలో అనవసరమైన భయాలను సృష్టించిందన్నారు. ఈ డ్రైవ్ మరింత మంది ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు ముందుకు వచ్చి కొవిడ్ టీకాలు తీసుకునేందుకు ప్రేరేపిస్తుందన్నారు.