సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ల్యాప్టాప్ పనిచేయడం లేదని వినియోగదారుడు అనేకసార్లు విన్నవించినా సేవల్లో నిర్లక్ష్యం ఏమిటని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ప్రశ్నించింది. సికింద్రాబాద్లోని శ్వేత కంప్యూటర్ బజార్, ఆసుస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. కొంపల్లికి చెందిన నవాజ్ సౌరాతియా విద్యార్థి. సికింద్రాబాద్లోని శ్వేత కంప్యూటర్ బజార్ నుంచి రూ.69వేలు చెల్లించి 14 ఇంచుల ఆసుస్ కంపెనీ ల్యాప్టాప్ను 2021, జూలై 1న కొనుగోలు చేశారు. పలు సందర్భాల్లో ల్యాప్టాప్ పనిచేయకుండా మొరాయించింది.
సర్వీస్ సెంటర్కు వెళ్లి సమస్యను తెలియజేసినా.. పట్టించుకోకపోవడంతో వినియోగదారుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించాడు. కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు లక్ష్మీప్రసన్న, మాధవిలతో కూడిన బెంచ్ విచారించింది. బాధిత విద్యార్థికి రూ.69వేలు 9 శాతం వడ్డీతో సంయుక్తంగా వాపస్ ఇవ్వడంతో పాటు రూ.5వేలు నష్టపరిహారం, రూ.5వేలు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.