మలక్పేట, ఏప్రిల్ 4: హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10,56,87,000 (రూ.10.57 కోట్లు)గా నమోదైందని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆంగోతు అనితా నాయక్, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి, ఉప సంచాలకులు దామోదర్లు తెలిపారు. మంగళవారం మార్కెట్ కార్యాలయంలో చైర్పర్సన్ అనితా నాయక్ అధ్యక్షతన మార్కెట్ ఆదాయ, వ్యయాలు, మార్కెట్ అభివృద్ధి పనులపై సర్వసభ్య సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… అక్టోబర్ నెలలో ప్రారంభం కావాల్సిన మిర్చి సీజన్ ఈ ఏడాది అతివృష్టి కారణంగా జనవరి మొదటి వారంలో ఆలస్యంగా ప్రారంభకావడం తో ఆదాయం సమకూరలేదని తెలిపారు. గతేడాది రూ.10.83 కోట్లు ఆర్జించటం జరిగిందన్నారు. అనంతరం మార్కెట్ ఎస్జీఎస్ దామోదర్ను, గ్రేడ్-3 కార్యదర్శి రవీందర్రెడ్డిని పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.
మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో రూ.1.30 కోట్లతో కవర్ షెడ్, రైతు విశ్రాంతి గదుల నిర్మాణం, మార్కెట్ యార్డులకు మెట్లు, సపోర్టింగ్ స్తంభాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం అన్ని పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని, షెడ్ నిర్మాణ దశలో ఉందని మార్కెట్ ఉప సంచాలకులు దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమావేశంలో తీర్మానించి ఆమోదించిన పనులపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా మార్కెట్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. మార్కెట్లో డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేయగా, ఎమ్మెల్యే అహ్మద్ బలాల మరో రూ.50 లక్షల మంజూరు చేయటం జరిగిందని, ఆ పనులు కూడా జూన్ వరకు పూర్తి కానున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్, డైరెక్టర్లు అభిషేకం, రాము యాదవ్, యాదగిరి, మాణిక్రావు, నరేశ్, సల్మాన్ మహ్మద్ఖాన్, ఎజాజ్, లిలితాబాయి, గ్రేడ్-3 కార్యదర్శి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.