వెంగళరావునగర్ : తల్లిదండ్రులను వేధిస్తున్న అన్నకు నచ్చచెప్పేందుకు వచ్చిన తమ్ముడితో జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ ప్రభాత్ నగర్కు చెందిన ఫారూఖ్ (28), జిలానీ(25)లు అన్నాదమ్ములు. కాగా జిలానీ దుండిగల్లో నివాసం ఉంటున్నాడు.
ప్రభాత్నగర్లో తల్లిదండ్రులతో కలిసి ఉండే ఫారూఖ్ మద్యానికి బానిసై డబ్బులు కావాలంటూ తరచూ తల్లిదండ్రులను వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు తల్లిదండ్రులతో ఫారూఖ్ డబ్బు కోసం ఘర్షణ పడి తల్లిని తీవ్రంగా కొట్టాడు. దీంతో అతని తల్లి దుండిగల్లో ఉంటున్న చిన్నకుమారుడు జిలానీకి ఫోన్ చేసి విషయం చెప్పింది.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం అన్నకు నచ్చచెప్పేందుకు తమ్ముడు జిలానీ బోరబండకు వచ్చాడు. బోరబండ బస్టాప్ వద్ద ఓ మద్యం దుకాణం వద్ద ఎదురుపడిన అన్నను మందలించబోయాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఫారూఖ్ తమ్ముడిని దుర్భాషలాడుతూ ఓ పెద్ద బండరాయి తీసి అతని ద్విచక్ర వాహనం పై వేశాడు.
అనంతరం కత్తి తీసి తమ్ముడు జిలానీ పై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన జిలానీ కత్తిని తాను లాక్కుని అన్న ఫారూఖ్ పై దాడి చేశాడు. సంఘటనలో షారూఖ్ కడుపు, చాతీ బాగంలో గాయాలయ్యాయి. ఈ సంఘటన అంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయింది.
సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన ఫారూఖ్ను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించారు. దాడికి పాల్పడిన జిలానీని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.