హయత్నగర్, జూలై 22: విద్యా బుద్ధులు నేర్పించి విద్యార్థులను సమాజంలో సత్ప్రవర్తనగా నడుచుకునే విధంగా తీర్చిదిద్దాల్సిన ఓ కళాశాల ప్రిన్సిపాల్ తన వక్రబుద్ధి చూపాడు. పరీక్షల్లో పాస్ చేయిస్తానని నమ్మించి లోబర్చుకున్నాడు. గత మూడు నెలలుగా బాధిత విద్యార్థినిని సినిమాలు, షాపింగ్లకు తిప్పాడు. విషయం బయటికి చెబితే ఇంటర్లో ఫెయిల్ చేపిస్తానని బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు. స్పెషల్ క్లాసుల పేరుతో పలువురు విద్యార్థినులకు ఫోన్ చేసి రప్పించుకొని వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధిత విద్యార్థిని, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హయత్నగర్ డివిజన్ శ్రీనివాస కాలనీలో విజయవాడ జాతీయ రహదారి పక్కన ఎస్బీఐ బ్యాంక్ పైఅంతస్తులో సత్యనారాయణ, భార్యతో కలిసి గౌతమి జూనియర్ కళాశాలను గత కొంతకాలంగా నడుపుతున్నాడు. రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్న ఓ విద్యార్థిని(18) అదే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఇంటర్ మొదటి సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కాగా.. ఎలాగైనా పాస్ చేయిస్తానని ప్రిన్సిపాల్ సత్యనారాయణ నమ్మబలికాడు. ఈనెల 12న నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డుకు సదరు విద్యార్థినిని తీసుకెళ్లాడు. అనంతరం దిల్సుఖ్నగర్లోని రాజధాని థియేటర్లో బాధిత విద్యార్థినికి సినిమా చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సహకరిస్తే.. అన్ని సబ్జెక్టుల్లోనూ పాస్ చేయిస్తానని విద్యార్థినిని నమ్మించాడు. కళాశాలలో స్పెషల్ క్లాసులు తీసుకుంటానని ఫోన్చేసి రప్పించుకొని.. వేధించసాగాడు. సహనం కోల్పోయిన బాధిత విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాలకు చేరుకొని సత్యనారాయణను నిలదీయడంతో పొంతనలేని సమాధానం చెప్పసాగాడు. దీంతో ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలంటూ హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గౌతమి కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణను గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
కళాశాల గుర్తింపు రద్దు చేయాలి
విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి గుండె శివకుమార్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులతో కలిసి ర్యాలీగా చేరుకుని హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు స్టాలిన్, సిద్ధు, నవీన్, విద్యార్థినులు పాల్గొన్నారు.