బోడుప్పల్, సెప్టెంబర్ 1: స్వచ్ఛమైన జలాలతో కళకళలాడుతూ ఆహ్లాదాన్ని పంచిన బోడుప్పల్ సర్కిల్ పరిధి చెంగిచర్లలోని చింతల చెరువు నేడు కాలుష్య కోరల్లో చికుకుంది. 34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులోకి ఎగువన ఉన్న 28 కాలనీల డ్రైనేజీ మురుగు చేరుతుండటంతో నీరు కలుషితమై జీవరాశులకు ప్రమాదకరంగా మారింది. దీంతో చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కళేబరాలు నీటిపై తేలుతుండటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతుండగా, స్థానికులు సైతం ఈ వాసనకు తట్టుకోలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి వ్యర్థ జలాలు చేరకుండా అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణ, సుందరీకరణే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. చెరువులను కాపాడి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ప్రకటిస్తోంది. అయితే చెంగిచర్లలోని చింతల చెరువు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. కలుషిత జలాలు, వ్యర్థాలతో చెరువు కంపు కొడుతుండగా.. చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటిస్తున్న హైడ్రా మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. దీనిని శుద్ధి చేసి మినీ ట్యాంక్ బండ్లా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
చింతల చెరువును తక్షణమే శాస్త్రీయ పద్ధతిలో ప్రక్షాళన చే యాలి. కాలనీల డ్రైనేజీ, మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టి, చెరువు పరిసరాలను అభివృద్ధి చేయాలి. చేపలు మృత్యువాత పడుతున్నా, కంపుకొడుతున్నా అధికారులు మౌనం పాటించడం సరికాదు. హైడ్రా, సంబంధిత శాఖలు స్పందించి చింతల చెరువుకు పునర్వైభవం తీసుకురావాలి.
– దుర్గపు క్రిష్ణ గౌడ్, క్రాంతి కాలనీ, 1వ డివిజన్ అధ్యక్షుడు